‘జెమిని సర్కస్‌’ శంకరన్‌ కన్నుమూత

‘జెమిని సర్కస్‌’ శంకరన్‌ కన్నుమూత

జెమిని సర్కస్‌ సంస్థ వ్యవస్థాపకుడు, భారత సర్కస్‌ దిగ్గజం జెమినీ శంకరన్‌(99) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నిరోజులుగా కన్నూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం (ఏప్రిల్ 23న) రాత్రి కన్నుమూశారు.  

1924లో జన్మించిన శంకరన్‌ ప్రఖ్యాత సర్కస్‌ కళాకారుడు కీలెరి కున్హికన్నన్‌ దగ్గర మూడేళ్లు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత అప్పటి సైన్యంలో చేరి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం వివిధ సర్కస్‌ కంపెనీల్లో పని చేశారు. 1951లో విజయ సర్కస్‌ను కొనుగోలు చేసిన శంకరన్‌, దాని పేరును ‘జెమిని’గా మార్చారు. తర్వాత జంబో సర్కస్‌ను కూడా ప్రారంభించారు. 

తాడుపై, ఐరన్‌ బార్‌పై నడవడంలో ప్రావీణ్యం సంపాదించారు. నిపుణులతో, విదేశాల నుంచి తెప్పించిన జంతువులతో తీర్చిదిద్దారు. 1964లో రష్యా అంతర్జాతీయ సర్కస్‌ ఫెస్టివల్‌లో శంకరన్‌ సారథ్యంలోని భారత్‌ బృందం పాల్గొంది. సర్కస్‌కు చేసిన సేవలకు గాను శంకరన్‌ను కేంద్ర ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింద.