- గురువారం అంబానీ సంపదకు చేరువైన అదానీ సంపద
- శుక్రవారం అదానీ గ్రూపునకు చాలా లాస్
ముంబై: మనదేశంలోనే అత్యంత సంపన్నులయిన రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీల నెట్వర్త్ పోటాపోటీగా పెరుగుతూనే ఉంది. అయితే అదానీ గురువారం పెద్ద చాన్స్ మిస్సయ్యారు. సంపదలో అంబానీకి దగ్గరగా వచ్చారు. ఇండియాతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడి రికార్డుకు సమీపంలో నిలిచారు. కొత్త కోవిడ్-19 వేరియంట్ భయంతో శుక్రవారం దలాల్ స్ట్రీట్లో విపరీతంగా అమ్మకాలు జరగడంతో అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు రిటైల్ ఇన్వెస్టర్ల నుండి విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. విపరీతంగా నష్టపోయాయి. దీంతో కేవలం కొన్ని గంటల్లో అదానీ సంపద12 బిలియన్లకు పైగా (దాదాపు రూ.90 వేల కోట్లు) తుడిచిపెట్టుకుపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్లు శుక్రవారం 1–-6 శాతం పడిపోయాయి. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి గౌతమ్ అదానీ సంపద 78.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5.84 లక్షల కోట్లు) తగ్గింది. ముఖేష్ అంబానీ సంపద 3.7 బిలియన్ డాలర్లు తగ్గి 91.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.6.83 లక్షల కోట్లు) పడిపోయింది.
ఇద్దరి సంపద మధ్య తేడా 0.5 బిలియన్ డాలర్లే!
అయితే గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీని దాటేయడానికి గురువారం దగ్గరగా వచ్చారు. అదానీ సంపద లైఫ్టైం హై 89.1 బిలియన్ డాలర్ల వద్ద ఉండేది. ముఖేష్ అంబానీ నెట్వర్త్ అప్పుడు 89.6 బిలియన్ డాలర్లు. అంటే అంబానీ కంటే అదానీ నెట్వర్త్ కేవలం అర బిలియన్ డాలర్లు తక్కువ. కమోడిటీ ట్రేడర్ నుంచి కుబేరుడిగా ఎదిగిన అదానీ సంపద 2021లో ఇప్పటివరకు 44.3 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇన్ఫ్రా రంగంలో ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలోకి ముందస్తుగా ప్రవేశించడం ద్వారా అదానీ గ్రూప్ భారీగా డబ్బు సంపాదించింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, పోర్ట్లు, ఎలక్ట్రిసిటీ వంటి ఇతర సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను తాకట్టు పెట్టడం వల్ల ఇబ్బంది పడింది. అయినప్పటికీ అదానీ సామ్రాజ్యం గత రెండేళ్లలో ఎంతో ఎదిగింది. అదానీ రిన్యువబుల్ ఎనర్జీ, విమానాశ్రయాలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలను పెంచడానికి రూ. 100 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ప్లాన్లను రెడీ చేసింది. ఇన్ఫ్రా సెక్టార్లో అదానీ గ్రూప్కు భారీగా ప్రాజెక్టులు దక్కాయి. వీటిలో ఎయిర్పోర్టులు, ఎలక్ట్రిసిటీ లైన్లు, నౌకాశ్రయాల వంటివి ఉన్నాయి. అయితే శుక్రవారం అదానీ కంపెనీల షేర్లు నష్టపోయినా గ్రూపునకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. అంబానీ నెట్వర్త్ను దాటడానికి మాత్రం ఇంకా కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నారు.
