- ఇండియాకు రెమిటెన్స్లు.. గల్ఫ్నుంచి తగ్గాయ్
- అమెరికా నుంచి పెరిగాయ్
- గల్ఫ్ దేశాల్లో జాబ్స్కు కోత
- యూఎస్లోని ఇండియన్ల ఆదాయాలు జంప్
- పోయిన ఏడాది 87 బిలియన్ డాలర్ల రాక
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో పనిచేసే చాలా మంది భారతీయులు కరోనా కారణంగా జాబ్స్ కోల్పోయారు. అమెరికాలోనూ కరోనా వల్ల నష్టాలు జరిగినా, ఉద్యోగాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందుకే ఈ దేశం నుంచి ఇండియన్లు డబ్బులు పంపడం తగ్గలేదు. ఒకప్పుడు ఫారిన్రెమిటెన్స్లు (విదేశాల నుంచి పంపే డబ్బు) గల్ఫ్ నుంచి ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు దానిని అమెరికాలోని ఇండియన్లు భర్తీ చేస్తున్నారు. అక్కడ ఇండియన్లకు ఐటీతోపాటు ఇతర వైట్కాలర్ జాబ్స్ వల్ల భారీ ఆదాయం వస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇండియాకు వచ్చిన మొత్తం రెమిటెన్స్లలో అమెరికా వాటా 23 శాతం ఉందని ఆర్బీఐలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్కు చెందిన సుమశ్రీ తివారీ, రంజిత మిశ్రా తయారు చేసిన రీసెర్చ్ పేపర్ వెల్లడించింది. అమెరికా ఎకానమీ రికవరీ ఇండియా రెమిటెన్స్ పెరుగుదలకు ఎంతో సాయపడిందని వరల్డ్ బ్యాంక్ రిపోర్టు కూడా పేర్కొంది.
కుటుంబమే ముఖ్యం...
కరోనా ఉన్నప్పటికీ అత్యధిక రెమిటెన్సులు వచ్చిన దేశంగా భారతదేశం అవతరించింది. భారతదేశం 2021 సంవత్సరంలో 87 బిలియన్ డాలర్ల రెమిటెన్స్లను అందుకుంది. ఈ విషయంలో చైనా, మెక్సికో వంటి దేశాల కంటే ముందున్నదని పోయిన ఏడాది జూలైలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు తెలిపింది. 2021లో మొత్తం గ్లోబల్ రెమిటెన్స్లలో భారతదేశం వాటా 12 శాతం ఉంది. కరోనా ప్రభావం ఉన్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఇతరుల కంటే ఎక్కువ డబ్బును ఇండియాలోని కుటుంబాలకు పంపారని ఆర్బీఐ ఎకనమిస్టులు తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు ప్రకారం.. రెమిటెన్స్ వల్ల ఇండియా ఎకానమీకి ఎంతో మేలు జరుగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా రెమిటెన్స్లు తగ్గుతాయని మొదట్లో అంచనాలు ఉన్నప్పటికీ (ప్రయాణ పరిమితులు, మాంద్యం ఫలితంగా) అలాందేమీ జరగలేదు.
గల్ఫ్ డబ్బులో తగ్గుదల
గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ రీజియన్ నుంచి భారతదేశానికి రెమిటెన్స్ల వాటా 2016–-17లో (చివరి సర్వే జరిగిన ఏడాది) 50 శాతం నుంచి 2020–-21లో దాదాపు 30 శాతానికి తగ్గిందని ఆర్బీఐ పరిశోధన పేర్కొంది. చాలా మంది భారతీయ వలసదారులు ఉద్యోగాలు కోల్పోవడమే ఇందుకు ముఖ్యకారణం. ఆయా దేశాలలో ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులను బట్టి రెమిటెన్స్లు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్టు మదన్ శబ్నవిస్ అన్నారు. "ఎకానమీ నెమ్మదించడం, జాబ్ లాస్ వల్ల గల్ఫ్ ప్రాంతం నుంచి రెమిటెన్స్లు తగ్గాయి. అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ఐటీ, ఇతర వైట్ కాలర్ ఉద్యోగాలలో ఉన్నారు. మహమ్మారి ఆంక్షల సమయంలోనూ ఉపాధి పరిస్థితి అధ్వానంగా ఏమీ లేదు. అంతేకాకుండా, అమెరికా ప్రభుత్వం కరోనా ప్యాకేజీలో భాగంగా తన ప్రజలకు మనీ ట్రాన్స్ఫర్ చేసింది. వలసదారులు ఇందులో కొంతడబ్బును తమ స్వదేశంలోని కుటుంబాలకు, బంధువులకు పంపించారు” అని ఆయన వివరించారు. యూకే, సింగపూర్ల నుంచి వచ్చే రెమిటెన్స్లు కూడా బాగా పెరిగాయి. 2020–-21లో మొత్తం చెల్లింపుల్లో అమెరికా, యూకే, సింగపూర్ల వాటా 36 శాతం ఉంది.
