రాష్ట్రపతి భవన్‌ను వీడిన రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి భవన్‌ను వీడిన రామ్ నాథ్ కోవింద్

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌ను వీడారు. ఢిల్లీ జన్‌పథ్ రోడ్డులోని తన కొత్త నివాసానికి కోవింద్ తన కుటుంబ సమేతంగా వెళ్లారు. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. కొత్త రాష్ట్రపతి ముర్ము చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌పై జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ నాథ్ కోవింద్ దేశ రాజ్యాంగాన్ని పణంగా పెట్టి బీజేపీ రాజకీయ అజెండాను అమలు చేశారంటూ ఆరోపించారు.

రామ్ నాథ్ హయాంలో దేశ రాజ్యాంగం పలుసార్లు ఉల్లంఘనకు గురైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ బిల్లును ప్రస్తావిస్తూ రామ్ నాథ్ కోవింద్‌ పై విమర్శలు చేశారు. మైనార్టీలు, దళితులపై దాడుల అంశాలను మెహబూబా ముఫ్తీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.