మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో జరిగిన వన్డే వరల్డ్కప్ సందర్భంగా బీసీసీఐ సెలెక్టర్లు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీ కప్పులు అందించారని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ సంచలన ఆరోపణలు చేశాడు. చాయ్ అందించడానికేనా సెలెక్టర్లు ఉన్నది? అంటూ ధ్వజమెత్తాడు. ఇదో మిక్కీ మౌజ్ సెలెక్షన్ కమిటీ అంటూ విమర్శించాడు. ‘వరల్డ్కప్ సందర్భంగా ఓ సెలక్టర్.. అనుష్క పక్కన కూర్చొని ఉన్నాడు. ఇండియన్ బ్లేజర్ ధరించాడు. ఎవరు నీవు అని అడిగితే సెలెక్టర్నని చెప్పాడు. వీళ్లందరు ఆమెకు చాయ్లు అందించడమే పనిగా పెట్టుకున్నారు. దిలీప్ వెంగ్సర్కార్లాంటి వ్యక్తులు సెలెక్షన్ కమిటీలో ఉండాలన్నది నా ఉద్దేశం. ఏదేమైనా సెలెక్షన్కమిటీపై కోహ్లీ తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ఇది మంచిదే అయినా.. మన సెలెక్టర్లకు సరైన అర్హత ఉందా? వాళ్లందరూ కలిసి 10, 12 టెస్ట్లు కూడా ఆడలేదు. అలాంటి వ్యక్తులకు టీమిండియా ఎంపికను అప్పగించారు. ఇది కరెక్ట్ కాదు’ అని ఇంజనీర్ పేర్కొన్నాడు.
నా పేరు ఎందుకు? అనుష్క
ఫరూఖ్ చేసిన వ్యాఖ్యలపై అనుష్క కూడా ఘాటుగా స్పందించింది. మాజీ క్రికెటర్ చేసిన ఆరోపణలన్నీ అబద్దం అని తోసిపుచ్చింది. ‘వరల్డ్కప్లో నాకు టీ అందించారని సెలెక్టర్లను తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఇది నిజం కాదు. నేను ఆ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ చూశా. అది కూడా ఫ్యామీలి బాక్స్లో కూర్చొని చూశా. సెలెక్టర్ల బాక్స్లో కాదు. నీవు సెలెక్షన్ కమిటీ మీద, వాళ్ల క్వాలిఫికేషన్ మీద కామెంట్ చేయాలనుకుంటే చేయి. అంతేగానీ సంచలనం కోసం నా పేరు ఎందుకు లాగుతున్నావు. ఇలాంటి సంఘటనల్లో నా పేరును చర్చించడానికి నేను ఒప్పుకోను’ అని అనుష్క ట్విట్టర్లో ట్వీట్ చేసింది. అసలు తాను టీ తాగనని చెప్పిన అనుష్క కాఫీ మాత్రమే తీసుకుంటానని వెల్లడించింది. ఈ మొత్తం ఎపిసోడ్పై ఓ సెలెక్టర్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అనుష్క సెలెక్టర్ల బాక్స్లో కూర్చొలేదని స్పష్టం చేశాడు.
ఉన్మాదపు మాటలు: ఎమ్మెస్కే
ఫరూఖ్ వ్యాఖ్యలు చాలా చిల్లరగా ఉన్నాయని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే అన్నాడు. చిన్న చర్చలో పాల్గొని పెద్ద మాటలతో ఉన్మాదపు ఆనందాన్ని పొందుతున్నాడని విమర్శించాడు. పనికిమాలిన ఆరోపణలతో సెలెక్టర్లను, టీమిండియా కెప్టెన్ భార్యని అవమానపరుస్తున్నాడని ఘాటుగా హెచ్చరించాడు.

