న్యూఢిల్లీ: ఈసారి కేంద్ర బడ్జెట్ మొత్తం పేపర్ లెస్గా జరిగే అవకాశాలున్నాయి. సాధారణంగా బడ్జెట్ పేపర్లను ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన ప్రెస్ ప్రింట్ చేస్తుంది. దీని కోసం 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారు. బడ్జెట్ ప్రకటించేంత వరకు ఈ ఉద్యోగులు బయటకు రాకుండా ఒకే దగ్గరుంటారు. కరోనా దెబ్బతో ఈ సారి బడ్జెట్ పేపర్లను ప్రింట్ చేయడం కంటే సాఫ్ట్ కాపీల(డిజిటల్గా) పార్లమెంట్ సభ్యులకు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇండిపెండెన్స్ వచ్చాక బడ్జెట్ పేపర్లు ప్రింట్ కాకుండా ఉండడం ఇదే మొదటి సారి అవుతుంది. ‘యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే(బడ్జెట్ పేపర్ల) ను ఈసారి ప్రింట్ కావు, దీనికి బదులుగా సాఫ్ట్ కాపీలను పార్లమెంట్ సభ్యులకు ఇస్తారు’ అని అధికారులు చెప్పారు. కాగా, ఫిబ్రవరి 1 న యూనియన్ బడ్జెట్ను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారు. ఈ ఏడాది బడ్జెట్ సెషన్ జనవరి 29 న ప్రారంభమై ఏప్రిల్ 8 వరకు జరుగుతుంది. మొత్తం రెండు దశలలో ఈ సెషన్ జరుగుతుంది. మొదటి దశలో జనవరి చివరిలో ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు, రెండో దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ సెషన్ జరుగుతుంది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 7 వరకు బ్రేక్ ఉంటుంది. కరోనా కారణంగా కిందటేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగలేదు. అందువలన ఈ సారి బడ్జెట్ సమావేశాలు వర్షాకాల సమావేశాల తర్వాత స్టార్ట్ అవుతున్నాయి.
