దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు దోచి పెడుతున్నారు

దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు దోచి పెడుతున్నారు

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కరోనాతో ఎకానమీ పడిపోయిన నేపథ్యంలో బడ్జెట్ విషయంలో కేంద్రం మరింత ఫోకస్‌‌ పెడితే బాగుండేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆపత్కాలంలో నిరుపేదలకు నేరుగా సాయం అందేలా పథకాలను రూపొందించాల్సిందని, నిరుద్యోగుల కోసం కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ చెప్పారు. జీడీపీని పెంచేలా, వినియోగదారుల డిమాండ్ పెరిగేలా రోడ్‌‌మ్యాప్‌‌ను రూపొందించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు.

ఈ బడ్జెట్ వ్యాపారవేత్తల కోసం పెట్టిందని సీపీఐ (ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి అన్నారు. ఇది సామాన్యుల కోసం తీసుకొచ్చిన బడ్జెట్ కాదని, కేవలం ఇండస్ట్రియలిస్ట్‌‌ల కోసమే ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్‌‌తో లాభాలను ఆర్జించే వారే ప్రయోజనం పొందుతారని ఏచూరి ఆరోపించారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట డిఫెన్స్, ఆయిల్, గ్యాస్ పైప్‌‌లైన్‌‌లు, ఎయిర్‌‌పోర్ట్‌లు, రైల్వేలు లాంటి దేశ సంపదను ప్రైవేటే సంస్థలకు దోచి పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ దేశాన్ని అమ్మేస్తున్నారని చెప్పారు.