చెక్​ బౌన్స్​ కేసులు తగ్గించడంపై ఫైనాన్స్ మినిస్ట్రీ దృష్టి..

చెక్​ బౌన్స్​ కేసులు తగ్గించడంపై ఫైనాన్స్ మినిస్ట్రీ దృష్టి..
  • హైలెవెల్​ కమిటీ సలహాలు, సూచనలు
  • ఇతర అకౌంట్ల నుంచి ఆటో డెబిట్​
  • డిఫాల్టర్​గా ప్రకటన..

న్యూఢిల్లీ: చెక్​ బౌన్స్​ కేసులు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో వాటిని తగ్గించడంపై ఫైనాన్స్​ మినిస్ట్రీ ఫోకస్​ పెడుతోంది. ఇచ్చిన చెక్కులు బౌన్స్​ అయితే ఇచ్చిన వారికి ఉన్న ఇతర బ్యాంకు అకౌంట్ల నుంచి ఆ మొత్తాన్ని ఆటో డెబిట్​ చేయడం, అలాంటి వారు  కొత్త బ్యాంకు అకౌంట్లు ఓపెన్​ చేయకుండా పరిమితులు విధించడం వంటి  చర్యలను మినిస్ట్రీ పరిశీలిస్తోంది. ఇటీవల జరిగిన ఒక హైలెవెల్​ మీటింగ్​లో నిపుణులు కొన్ని సలహాలు, సూచనలను ఇవ్వడంతో వాటిలో కొన్నింటిని అమలులోకి తేవాలని ఫైనాన్స్​ మినిస్ట్రీ ప్లాన్​ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. చెక్​బౌన్స్​ను లోన్ ​డిఫాల్ట్​గా ట్రీట్​ చేసి, క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలకు రిపోర్ట్​ చేయాలనే సూచన కూడా ఈ హైలెవెల్​ మీటింగ్​లో వచ్చినట్లు పేర్కొన్నాయి. దీనివల్ల వారి క్రెడిట్​స్కోరు తగ్గుతుంది. ఈ సూచనలను కూలంకషంగా పరిశీలించి, లీగల్​ఎఫెక్ట్​నూ స్టడీ చేయాలనే నిర్ణయానికి ఫైనాన్స్​ మినిస్ట్రీ వచ్చినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. 

హై లెవెల్​ మీటింగ్​లో వచ్చిన సలహాలు, సూచనలలో కొన్నింటినైనా అమలులోకి తెస్తే చెక్​బౌన్స్​ కేసులు బాగా తగ్గే ఛాన్స్​ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో దేశంలోని కోర్టులపై చెక్​బౌన్స్​ కేసుల ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో చెక్​ బౌన్స్​ చేసిన వ్యక్తిని ఇతర మార్గాలలో చెల్లింపు వెంటనే జరిపేలా ఒత్తిడి పెంచొచ్చనే సూచన కూడా ఉంది. ఇలాంటి చొరవ వల్ల ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​ మెరుగుపడుతుందని, ఉద్దేశపూర్వకంగా చెక్కులను బౌన్స్​ చేయడం తగ్గుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. అన్ని బ్యాంకుల డేటాను ఇంటిగ్రేట్​ చేయడం ద్వారా పైన పేర్కొన్న సలహాలు, సూచనలను అమలులోకి తేవొచ్చని పేర్కొంటున్నారు. దాంతోపాటు ఆటో డెబిట్​, ఇతర సూచనల​పై స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్​ తేవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దేశంలోని వివిధ కోర్టులలో మొత్తం 35 లక్షలకుపైగా చెక్​బౌన్స్​ కేసులు పేరుకుపోయాయి. దీంతో వీటిని తొందరగా పరిష్కరించడం కోసం సుప్రీం కోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. చెక్​బౌన్స్​ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే దానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సుప్రీం కోర్టు విచారణలో ఒప్పుకుంది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రొసీజరల్​ రిఫార్మ్స్​ కొన్నింటిని రికమెండ్​ చేసింది.