ముంబై : రిలయన్స్ క్యాపిటల్ ఆడిట్ సంస్థ పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్హౌస్ అండ్ కో)ల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఆడిట్ సంస్థపై ఇండియాలో మునుపెన్నడూ లేనివిధంగా రూ. 10 వేల కోట్లకు పరువు నష్టం కేసు వేయాలని అనిల్ అంబానీ గ్రూప్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో కొన్నింటి వాటాదారులు కూడా ఈ ఆడిట్ సంస్థపై వేరుగా క్లాస్ యాక్షన్ సూట్ దాఖలు చేయనున్నారు. తమ పెట్టుబడులు విలువ కోల్పోయినందుకు వాటాదారులు ఈ కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. రెండు న్యాయ సంస్థల నుంచి క్లీన్ చిట్ రావడంతో అనిల్ అంబానీ గ్రూప్ కేసు వేయాలనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్లో ఆడిటర్పై లీగల్ చర్య తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడినట్లు సమాచారం. కొంత మంది వాటాదారులు కోరడంతో క్లాస్ యాక్షన్ సూటూ ఫైల్ చేయాలని నిర్ణయించినట్లు ఈ విషయం తెలిసిన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆడిట్ సంస్థ వల్ల కంపెనీ పరువు–ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు, షేర్ హోల్డర్లకు భారీ నష్టం కలిగిందని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. పీడబ్ల్యూసీ ఇండియా నెట్వర్క్లోని ప్రైస్ వాటర్హౌస్ అండ్ కో రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలకు ఆడిటర్గా ఈ ఏడాది జూన్లో వైదొలగింది. అవసరమైన అదనపు సమాచారం ఇవ్వడంలో కంపెనీలు విఫలమయ్యాయని, సరైన జవాబులు కూడా రాకపోవడం వల్లే రిజైన్ చేస్తున్నట్లు ఆడిట్ సంస్థ అప్పట్లో వెల్లడించింది. కంపెనీలో మోసాలు జరిగినట్లు అనుమానం వచ్చేలా కంపెనీల చట్టంలోని సెక్షన్ 143 (12) కింద రిజైన్ చేస్తున్నట్లు పీడబ్ల్యూసీబఎంసీఏకు తెలిపింది. రెండు ప్రముఖ లా సంస్థలు, ఇండిపెండెంట్ లాయర్లు, ఆడిటర్లతో చర్చించి వారి అభిప్రాయం తెలుసుకున్నట్లు కిందటి వారం రిలయన్స్ క్యాపిటల్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. పీడబ్ల్యూసీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
