న్యూఢిల్లీ: ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ ప్రెసిడెంట్గా తెలుగు మహిళ, అపోలో హాస్పిటల్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సంగీత రెడ్డి ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిలో ఏడాది కాలం పాటు (2019–20 లో) సేవలందిస్తారు. ఫిక్కీకి రానున్న ఏడాది బాగుంటుందని ఆశిస్తున్నానని ఎన్నికైన తర్వాత సంగీత రెడ్డి చెప్పారు. తాజాగా పూర్తయిన 92 వ ఏజీఎంలో, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ను వేసుకున్నామన్నారు. ఇది జరిగేందుకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేస్తామని సంగీత రెడ్డి తెలిపారు. తెలుగు వారైన వీఎల్ దత్1991లో ఫిక్కీ ప్రెసిడెంట్గా సేవలందించారు. సంగీత రెడ్డి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వగా, వాల్ట్ డిస్నీ ఏపీఏసీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. సంగీత రెడ్డికి ముందు హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ సందీప్ సోమానీ ఫిక్కీ ప్రెసిడెంట్గా సేవలందించారు. హెచ్యూఎల్(హిందుస్తాన్ యూనిలీవర్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యారు.
