8వ రౌండ్ మీటింగ్లో రైతు యూనియన్లు
కుదరదని చెప్పిన కేంద్ర మంత్రులు
మళ్లీ ఏం తేలకుండానే ముగిసిన చర్చలు
న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు ఎటూ కొలిక్కి రావడం లేదు. శుక్రవారం జరిగిన ఎనిమిదో విడత చర్చలు కూడా ఏం తేలకుండానే ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే (లా వాపసీ) తాము ఇండ్లకు వెళ్తామని (ఘర్ వాపసీ) రైతులు కచ్చితంగా చెప్పగా కేంద్రం కుదరదని స్పష్టం చేసింది. వివాదాస్పదమని చెబుతున్న రూల్స్పైనే మాట్లాడదామని, మొత్తం చట్టాల రద్దు కుదరదని తేల్చేసింది. దీంతో చర్చలు మళ్లీ ఏం తేలకుండానే ముగిశాయి. తర్వాతి చర్చలను సోమవారం జరిగే సుప్రీంకోర్టు విచారణ తర్వాత నిర్ణయించనున్నట్టు తెలిసింది.
చాలా రాష్ట్రాల్లో మద్దతిచ్చారు: మంత్రులు
41 మంది రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సమావేశమయ్యారు. ‘వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని సుప్రీంకోర్టు ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. కాబట్టి ఇందులో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. రోజుల తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సమస్యను పరిష్కరించే ఉద్దేశం సర్కారుకు లేదనిపిస్తోంది. అదే నిజమైతే మీరేమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. మేం వెళ్లిపోతాం. అందరి టైమ్ను ఎందుకు వేస్ట్ చేయడం’ అని మీటింగ్లో ఓ రైతు ప్రశ్నించినట్టు తెలిసింది. చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులందరూ డిమాండ్ చేయగా చాలా రాష్ట్రాల్లో చట్టాలకు మద్దతిచ్చారని మంత్రులు చెప్పారు. దేశంలోని మిగతా ప్రాంతాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలని రైతు యూనియన్లను కోరారు. ‘చట్టాలను రద్దు చేయలేం. కావాలంటే మీరు సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. చట్టాలు అక్రమమని కోర్టు చెబితే మేం ఉపసంహరించుకుంటాం. కరెక్టేనని తీర్పొస్తే ఉద్యమాన్ని విరమించుకోవాలి’ అని రైతులకు మంత్రులు చెప్పినట్టు సమాచారం.
తర్వాతైనా ప్రతిపాదనలతో వస్తారనుకుంటున్నా: తోమర్
అగ్రి చట్టాల రద్దుకు బదులుగా ఏదైనా ప్రతిపాదన తీసుకొస్తే అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రైతులు ఏ ప్రతిపాదనా చేయలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మీటింగ్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఏ నిర్ణయం లేకుండానే మీటింగ్ ముగిసిందని, తర్వాతి సమావేశం ఈ నెల 15న జరుగుతుందని, అప్పుడు ప్రత్యామ్నాయాలతో రైతులు వస్తారని ఆశిస్తున్నానన్నారు. చట్టాల అమలుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునేలా ప్రపోజల్ ఏమైనా వచ్చిందా అని మీడియా అడగ్గా రైతులు అలాంటిదేం అడగలేదని చెప్పారు.
లంచ్ టైంలో నిరసనలు
గంట పాటు మీటింగ్ జరిగాక రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో మంత్రులు మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చేశారు. అధికారులతో మాట్లాడారు. ఆ టైమ్లో రైతు సంఘాల నేతలు హాల్లోనే మౌనంగా ఉన్నారు. ‘జీతేంగే యా మరేంగే’ స్లోగన్స్ రాసి ఉన్న పేపర్లు పట్టుకుని నిరసన తెలిపారు. లంచ్ చేసేందుకూ రైతులు నిరాకరించారు.
For More News..
టాలెంట్ ఉన్నోళ్లకే హెచ్1బీ వీసా.. ట్రంప్ కొత్త నిర్ణయం
ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ.. హెచ్చరించిన కేంద్రం
ట్రంప్కు ట్విట్టర్ షాక్.. అకౌంట్పై శాశ్వత నిషేధం
