తిరుమల: మరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని అర్చకులు రమణదీక్షితులు అన్నారు. పదవీవిరమణ చేయించిన వారిని తిరిగి విదుల్లోకి తీసుకోవడంపై తమ అర్చకులంతా ఆయనకు రుణపడి ఉన్నామన్నారు. ఏపీ ప్రభుత్వం టీటీడీ ఆగమ సలహా దారుడిగా రమణదీక్షితులును నియమించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
వందల సంవత్సరాలుగా శ్రీవారి కైంకర్యాలలొ నాలుగు కుటుంబాలు తరిస్తూ వస్తున్నాయని, రాజుల కాలంలో , బ్రిటిష్ వారి కాలంలో, కరువుకాటకాలు వచ్చినా స్వామివారికి తామెప్పుడూ లోటు చెయ్యలేదని రమణ దీక్షితులు అన్నారు. తిరుమలలో వంశపారంపర్యాన్ని రద్దు చేసాక 2007 లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఈ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశారని, తర్వాత వచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం వాటిని విస్మరించిందని అన్నారు. చట్టంలో, ఆగమంలో లేని వాటిని చూపించి, రిటైర్మెంట్ ప్రకటించారని అన్నారు.
ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్టి తనను ఆగమ సలహ మండలి సభ్యునిగా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. మరో వారంలో ప్రధాన అర్చకులుగా ఇస్తారని టీటీడీ అధికారులు చెప్పారని మీడియా కి తెలిపారు. తనతోపాటు మరో నలుగురికి ప్రధాన అర్చకుల బాధ్యతనిస్తారని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఆలయాలని అభివృద్ధి చెయ్యటానికి అనేక ప్రణాళికలు రూపోందిస్తున్నారని, సీఎం చేపట్టిన ధార్మిక కార్యక్రమాల వల్లే రాష్ట్రంలో సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, అర్చకులను సీఎం కాపాడాలని, మరో 30 సంవత్సరాలు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని రమణ దీక్షితులు అన్నారు.
గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణదీక్షితులును గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల విధులకు దూరం చేసింది. తాజాగా సీఎం జగన్ ఆదేశాల మేరకు తిరిగి ఆయన్ను టీటీడీ ఆగమ సలహా దారుడిగా నియమించింది.

