న్యూఢిల్లీ : ఒక వైపు కరోనా వైరస్ భయం.. మరోవైపు ఈ వైరస్ దెబ్బకు ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. ఇలాంటప్పుడు కూడా గోల్డ్ ధరలు మాత్రం ఇవేమీ పట్టనట్టు పెరుగుతున్నాయి. జ్యూయల్లరీ దుకాణాలకు వెళ్లి బంగారం కొనే వాళ్లే కరువైనా.. ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే..గ్లోబల్గా ఇన్వెస్టర్ల చూపంతా గోల్డ్పైనే కాబట్టి. కరోనా వైరస్ భయానికి ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతుంటే.. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. వెస్ట్రన్ ఇన్వెస్టర్లందరూ గోల్డ్లోనే తమ మనీని పెట్టుబడిగా పెడుతున్నారు. దీంతో ఎనిమిదేళ్ల గరిష్టానికి గోల్డ్ ధరలు ఎగిశాయి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి ఈ ఏడాది నార్త్ అమెరికా, యూరప్ల నుంచి బాగా పెట్టుబడులు వచ్చాయి. 2009లో నమోదైన రికార్డు స్థాయిలకు కాస్త దూరంలోనే ఈ ఇన్ఫ్లోలు ఉన్నట్టు బ్లూమ్బర్గ్ డేటాలో వెల్లడైంది. మరోవైపు చైనా, ఇండియా లాంటి ట్రెడిషినల్ రిటైల్ కొనుగోలుదారుల నుంచి మాత్రం ఫిజికల్గా బంగారానికి డిమాండ్ పడిపోయింది. గోల్డ్ బార్లు, కాయిన్లు, జ్యూయల్లరీని ప్రపంచంలోనే అతి ఎక్కువగా కొనుగోలు చేసేది ఈ రెండు దేశాల ప్రజలే. కానీ కరోనా వైరస్ కారణంతో ఈ రెండు దేశాల్లో ఫిజికల్గా గోల్డ్ను ఎవరూ కొనడం లేదు. దీనికి తోడు ధరలు కూడా ఎక్కువవడంతో వాటి జోలికెళ్లడం లేదు. దీంతో బంగారం దిగుమతులు తగ్గిపోయాయి. సేల్స్ పడిపోయాయి. గోల్డ్ ధరలు పెరగడం, తగ్గడం అనేది ప్రధానంగా రెండు కారణాలపైనే ఆధారపడుతోంది. ఒకటి, వెస్ట్రన్ ఇన్వెస్టర్లు సురక్షితమైన సాధనంగా గోల్డ్ను పరిగణించడమైతే, రెండోది, ఆసియా దేశాలలో ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లు. ఒకవేళ గ్లోబల్గా ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు తగ్గితే గోల్డ్ ధరలకు ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా, యూరప్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్…
ఆసియా డిమాండ్తో పోలిస్తే అమెరికా, యూరోపియన్ ఇన్వెస్టర్ల నుంచే గోల్డ్కు ఎక్కువగా డిమాండ్ వస్తుందని తాము భావిస్తున్నామని డబ్ల్యూఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అమెరికాస్ పోర్ట్ఫోలియో మేనేజర్, కమోడిటీస్ హెడ్ డార్వే కుంగ్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా గోల్డ్ను ఎంపిక చేసుకోవడంతో, ఈ ఏడాది గోల్డ్ ధరలు 18 శాతం మేర పెరిగాయని గోల్డ్మ్యాన్ శాచ్స్ గ్రూప్ తన జూన్ నోట్లో పేర్కొంది. ఈ ఏడాది చివరి ఆరు నెలల కాలంలో అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఎకనమిక్ రికవరీ, డాలర్కు డిమాండ్ తగ్గడం వంటివి గోల్డ్ ధరలు తగ్గడానికి బదులు మరింత పెరిగేలా చేస్తాయని చెప్పింది.
ఎకానమీ రీ ఓపెన్ అయినా..
2020లో స్పాట్ గోల్డ్ ధరలు 17 శాతం పెరిగాయి. ఈ నాలుగేళ్లలో ఈ రెండో క్వార్టర్లోనే అత్యధికంగా ర్యాలీ చేశాయి. గోల్డ్ ఫ్యూచర్స్ కామెక్స్లో ఒక ఔన్స్కు 1,800 డాలర్లకు పెరిగాయి. 2011 నుంచి ఈ మేర పెరగడం ఇదే తొలిసారి. బంగారం ధరల పెరుగుదల ఆసియా మార్కెట్లోని వారిని నిరుత్సాహపరుస్తోంది. ఒకవేళ ఎకానమీ రీ ఓపెన్ అయినా.. ఆసియన్ షాపర్లపై ఈ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. కరోనా లాక్డౌన్లు, ఉద్యోగాల కోత, ఎకనమిక్ గ్రోత్ తగ్గిపోవడం వంటి కారణాలతో ఇండియా, చైనాల్లో బంగారానికి డిమాండ్ తగ్గిపోతోంది.
ఇండియాలో 36 శాతం డిమాండ్ డౌన్…
2020లో చైనా గోల్డ్ జ్యూయల్లరీ వినియోగం 23 శాతం మేర తగ్గుతుందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ అంచనావేసింది. అదేవిధంగా ఇండియాలో 36 శాతం మేర డిమాండ్ పడుతుందని తెలిపింది. చైనాలో గోల్డ్ సేల్స్ 2019 కంటే 30 శాతం తక్కువకు పడిపోయాయని చైనా గోల్డ్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాంగ్ యాంగ్టావో చెప్పారు. కరోనా వైరస్ అవుట్బ్రేక్తో 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు.
గోల్డ్ లోన్లపై బ్యాంకుల ఫోకస్
సురక్షితమైన గోల్డ్ లోన్లపై ఫెడరల్ బ్యాంక్ ఫోకస్ చేసింది. ఇతర క్రెడిట్ ఆప్షన్లు తగ్గుతోన్న ఈ సమయంలో, గోల్డ్ లోన్ల సెగ్మెంట్ బాగా పెరుగుతున్నట్టు బ్యాంక్ పేర్కొంది. దీని కోసం రూ.12 వేల కోట్ల క్యాపిటల్ను సేకరించేందుకు బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపినట్టు ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 29 శాతం గ్రోత్ నమోదు చేసిన బ్యాంక్ గోల్డ్ లోన్ సెగ్మెంట్ ఈ ఏడాది 35 శాతం గ్రోత్పై ఫోకస్ చేసింది. బ్యాంక్ గోల్డ్ లోన్ బుక్, మొత్తం లోన్ బుక్లో 8 శాతంతో రూ.9,600 కోట్లుగా ఉంది. ఈ లోన్ బుక్ ఈ ఏడాది 15 శాతం పెరగనుందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. కేవలం జూన్ క్వార్టర్లోనే గోల్డ్ లోన్ గ్రోత్ 5 శాతంగా ఉండనుందని చెప్పారు. గోల్డ్ ధరలు పెరుగుతున్నందున చాలా బ్యాంక్లు కూడా ప్రస్తుతం గోల్డ్ లోన్లపై ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో గోల్డ్ను తనాఖా పెట్టుకుని, బ్యాంక్లు లోన్లు ఇస్తున్నాయి.

