న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లో నెట్ ఇన్ఫ్లో ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. అక్టోబర్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లో రూ.6,015 కోట్లుగా ఉన్నట్టు వెల్లడైంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆమ్ఫీ) డేటా ప్రకారం, ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్లోకి రూ.6,026 కోట్లను పెట్టుబడిగా పెట్టగా.. క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ప్లాన్స్ నుంచి రూ.11 కోట్లు బయటికి వెళ్లిపోయాయి. అంటే మొత్తంగా నెట్ ఇన్ఫ్లో అక్టోబర్ నెలలో రూ.6,015 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నెలలో ఈక్విటీ, ఈక్విటీతో లింక్ అయిన సేవింగ్ స్కీమ్స్లోకి వచ్చిన నెట్ ఇన్ఫ్లోస్ రూ.6,489 కోట్లుగా ఉన్నాయి. ఆగస్ట్లో ఇవి రూ.9,090 కోట్లుగా, జూలైలో రూ.8,092 కోట్లుగా, జూన్లో రూ.7,585 కోట్లుగా ఉన్నట్టు ఆమ్ఫీ డేటాలో వెల్లడైంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే.. నెట్ ఇన్ఫ్లో కాస్త తక్కువగా ఉందని తెలిసింది. ఇటీవల దేశీయ ఆర్థిక వ్యవస్థకు బూస్టప్ ఇవ్వడం కోసం ప్రభుత్వం తీసుకుంటోన్న పలు చర్యలు, సెంటిమెంట్ను మెరుగుపరుస్తున్నాయని, దీంతో మార్కెట్లు పెరుగుతున్నాయని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. ఇన్వెస్టర్లలో నెమ్మదిగా విశ్వాసం బలపడుతుందని, మళ్లీ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈక్విటీ మార్కెట్లు మరింత మెరుగ్గా పర్ఫార్మ్ చేయనున్నాయని, దీంతో మ్యూచువల్ ఫండ్స్లో మరింత ఇన్ఫ్లోస్ ఉంటాయని అంచనావేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లోస్ తగ్గినా.. అసెట్ ఆధారిత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్ నెలలో రూ.7.9 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకుముందు నెలలో ఇవి రూ.7.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లోకి వచ్చిన ఇన్ఫ్లో గత నెలలో రూ.1.33 లక్షల కోట్లుగా ఉంది. దీనిలో డెట్ ఓరియెంటెడ్ స్కీమ్స్లోకి ఎక్కువగా రూ.1.2 లక్షల కోట్లు వచ్చాయి.

