కరోనా దెబ్బకు ఆగిపోయిన ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి మొదలయ్యేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ చేరుకున్న వెస్టిండీస్ క్రికెట్ టీమ్ –14 రోజుల ఐసోలేషన్ పిరియడ్ను పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో జరిగే టెస్టు సిరీస్ కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా కరీబియన్లు మంగళవారం తొలి ఇంటర్నల్ వామప్ మ్యాచ్ ఆడారు. ఈ నెల 9న ఇంగ్లండ్లో అడుగుపెట్టిన విండీస్ క్రికెటర్లు కొవిడ్ రూల్స్ ప్రకారం మాంచెస్టర్లో ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్లోని హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. ఐసోలేషన్ పూర్తవడంతో ప్రాక్టీస్ మొదలెట్టారు. హోల్డర్, బ్రాత్వైట్ కెప్టెన్సీల్లో రెండు జట్లుగా విడిపోయి వామప్ ఆడారు. కొవిడ్ రూల్స్ పాటించిన క్రికెటర్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సెలబ్రేషన్స్లో షేక్ హ్యాండ్స్కు దూరంగా ఉన్నారు. పోస్ట్ కరోనా తర్వాత ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ పూర్తిస్థాయిలో గ్రౌండ్లోకి రావడం ఇదే తొలిసారి. వచ్చే నెల 8న మొదలయ్యే సిరీస్కు ముందు కరీబియన్లు మరో రెండు వామప్ మ్యాచ్లు ఆడతారు.
రేపటి నుంచి ఇంగ్లండ్ ట్రెయినింగ్
మరోవైపు ఇంగ్లండ్ టీమ్ కూడా గురువారం నుంచి ట్రెయినింగ్ మొదలుపెట్టనుంది. 30 మందితో కూడిన ఇంగ్లండ్ టీమ్ ఇప్పటికే సౌతాంప్టన్లోని ఏజెస్ బౌల్ స్టేడియానికి చేరుకుంది. వీరందరికీ పది రోజుల క్రితం కరోనా టెస్ట్లు చేయగా నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. రూల్స్ ప్రకారం క్రికెటర్లతోపాటు 15 మంది సపోర్ట్ స్టాఫ్కు మళ్లీ టెస్ట్లు చేస్తారు. అందులో నెగెటివ్ వస్తే గురువారం నుంచి ట్రెయినింగ్ మొదలుపెడతారు. ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం మరో బ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుంది. అనంతరం ఇంగ్లండ్ టీమ్ను 20 మందికి కుదించి ఇంటర్నల్ వామప్ మ్యాచ్ ఆడిస్తారు. మూడు రోజుల ఈ వామప్ పోరు జులై 1 నుంచి 3 వరకు జరుగుతుంది. తర్వాత ఫస్ట్ టెస్టు కోసం టీమ్ను ఎంపిక చేస్తారు. సిరీస్ పూర్తయ్యే వరకూ ఆటగాళ్లకు ప్రతి రోజు థర్మల్ స్ర్కీనింగ్ చేయడంతో పాటు వారానికి రెండుసార్లు టెస్టులు చేస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూస్తారు. పోస్ట్ కరోనా తర్వాత జరిగే తొలి ఇంటర్నేషనల్ సిరీస్ కోసం ఇంగ్లండ్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏజెస్ బౌల్ స్టేడియంలో బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. స్టేడియాన్ని జోన్లుగా డివైడ్ చేసింది. కొన్ని ఏరియాల్లోకి ప్లేయర్లు, కీలకమైన సపోర్ట్ స్టాఫ్ను మాత్రమే అనుమతిస్తోంది. కాగా, ఈ సిరీస్లో మూడు మ్యాచ్లకు ఫ్యాన్స్కు అనుమతి లేదు. కేవలం టీవీల్లోనే లైవ్ టెలీకాస్ట్ అవుతుంది.

