మంత్రి వర్గ విస్తరణపై బీజేపీ, షిండే సుదీర్ఘ చర్చలు 

మంత్రి వర్గ విస్తరణపై బీజేపీ, షిండే సుదీర్ఘ చర్చలు 

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్  షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ నడ్డాను కలవనున్నారు. మిత్రపక్షాలు కలిసి మంత్రి మండలి ఏర్పాటుపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను  ఫడ్నవీస్ కలిశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా మర్యాదపూర్వకంగా కలవాలని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి హోంమంత్రి అమిత్ షాను షిండే, ఫడ్నవీస్ కలిశారు. బీజేపీ, షిండే నేతృత్వంలోని వర్గానికి పదవుల పంపకాలపై  చర్చించారు. నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో షిండే, ఫడ్నవీస్ ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తారని, మహారాష్ట్రను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని నమ్మకం ఉందని ట్విట్టర్‌లో అమిత్ షా  పేర్కొన్నారు. ఏక్ నాథ్ షిండేతోపాటు15 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో షిండే,ఫడ్నవీస్ లు దేశ రాజధానిలో కమలనాథులను కలవడం చర్చనీయాంశంగా మారింది. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న షిండే... శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మద్దతు తనకే ఉందన్నారు.