శిథిలావస్థలో తిరుమల రాతి మండపం: ఈవో ధర్మారెడ్డి

తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కుడి వైపు ఉన్న రాతి మండపం రిపేరు చేయడానికి కూడా వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకుందని వెల్లడించారు. రాతి మండపం రాళ్ళు పునర్నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే కాకుండా శిథిలావస్థకు చేరిన తిరుమలలోని పార్వేట మండపాన్ని కూల్చి పునర్నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేసిన.. రాతి మండపాలను యథావిధిగా రూ.1.36 లక్షలు వెచ్చించి 20 పిల్లర్లతో పునర్ నిర్మాణం చేస్తున్నామని స్పష్టం చేశారు.  నడక మార్గంలో చిరుతలు సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని వెల్లడించారు.

కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదని అన్నారు. అటవీ జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, సి.సి కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 29న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 29న తిరిగి తెరుస్తామని పేర్కొంది.