హైదరాబాద్, వెలుగు: తెలంగాణాను వ్యవసాయ ఎగుమతి కేంద్రంగా మలచాలంటే టెక్నాలజీ వాడకం, నాణ్యమైన పెస్టిసైడ్స్, న్యూట్రియంట్స్ చాలా ముఖ్యమని అగ్రిటెక్ కంపెనీ ధనుకా గ్రూప్ ఛైర్మన్ ఆర్.జి. అగర్వాల్ అన్నారు. తెలంగాణ రైతులకు మరింత సాయపడేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు. ఆధునిక సాగు పద్ధతులు, టెక్నాలజీ వాడకాన్ని పెంచడానికి, పరిశోధనల కోసం, రైతు సంక్షేమ కార్యక్రమాల కోసం వర్సిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. డ్రోన్లు, రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకోవడంతో పాటుగా నాణ్యమైన విత్తనాల వాడకం, సరైన ఎరువులు, పురుగుమందులను వాడితే రైతుల ఆదాయం, దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా నకిలీ విత్తనాలు, పెస్టిసైడ్స్ పెరిగిపోవడం వల్ల వ్యవసాయరంగం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ‘‘చైనాతో పోలిస్తే మన దగ్గర వర్షపాతం ఎక్కువ. అక్కడ ఎకరానికి కనీసం 13 కిలోల పెస్టిసైడ్స్ వాడుతున్నారు. మన దగ్గర కిలో కంటే తక్కువే! క్వాలిటీ హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడకుండా రైతు ఆదాయం పెరగడం సాధ్యం కాదు. మాకు ప్రస్తుతం మూడు యూనిట్లు ఉన్నాయి. మరో యూనిట్ను గుజరాత్లో ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం రూ.100 కోట్ల క్యాపెక్స్ను కేటాయించాం. ఆర్ అండ్ డీ కోసం కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం”అని వివరించారు. పంటలకు పెస్టిసైడ్స్ను పిచికారీ చేసే డ్రోన్ను కూడా ఈ సందర్భంగా ధనూకా ప్రదర్శించింది. వచ్చే ఏడాది నుంచి ఇవి తెలంగాణ రైతులకు అందుబాటులోకి తెస్తారు. రూ.ఆరు లక్షల విలువ చేసే ఈ డ్రోన్ను కిరాయికి తెచ్చుకోవచ్చని, ఒక్కసారి చార్జ్ చేస్తే 2 ఎకరాల మేర పిచికారీ చేసుకోవచ్చని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చెప్పారు.
