9ఏళ్ల వయసులోనే కసబ్ ను ఉరికంబానికెక్కించిన ఈ అమ్మాయిని మహరాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే జీషాన్ సిద్ధక్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కోరారు.
26/11లో తొమ్మిదేళ్ల దేవిక రోటవన్ తన తల్లిదండ్రులతో కలిసి సీఎస్ టీ రైల్వే స్టేషన్ లో ఉంది. ఆ సమయంలో టెర్రరిస్ట్ కసబ్ అండ్ గ్యాంగ్ రైల్వేస్టేషన్ లో మారణ హోమానికి పాల్పడ్డారు. ఆ సమయంలో తొమ్మిదేళ్ల దేవిక రోటవన్ కాలిపై కసబ్ గన్ తో షూట్ చేశాడు. దీంతో ప్రాణాల్ని దక్కించుకునేందుకు పక్కనే ఉన్న రెస్ట్ రూమ్ వైపుకు పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
అనంతరం అత్యవసర చికిత్స కోసం రోటవన్ ను ఆస్పత్రికి తరలించారు. సుమారు ఒకటిన్నరనెల తరువాత కోర్ట్ కోరడంతో కసబ్ ను గుర్తించేందుకు రోటవన్ కోర్ట్ కు వచ్చింది. సీఎస్టీ స్టేషన్ లో కాల్పులకు పాల్పడింది ఎవరో చెప్పాలని కోర్ట్ కోరగా..తొమ్మిదేళ్ల వయసున్న రోటవన్ తనని కాల్చిన కసబ్ ను గుర్తించింది. కసబ్ తనని కాల్చాడని చెప్పడంతో కాల్పుల కేసులో రోటవన్ సాక్ష్యం కీలకంగా మారింది.
2008లోనే కసబ్ ను గుర్తించినందుకు గాను రోటవన్ కుటుంబానికి అప్పటి మహరాష్ట్రప్రభుత్వం ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆహామీ ఇప్పటికి నెరవేరలేదని రోటవన్ 2019లో హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి అనే సోషల్ మీడియా సంస్థకు తెలిపింది.
తాజాగా రోటవన్ కుటుంబాన్ని ఆదుకోవాలని మహరాష్ట్ర ఎమ్మెల్యే జీషాన్ సిద్దిక్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. దేవిక రోటవన్ ను కలిశాను. 26/11 దాడుల తరువాత కోర్టులో కసబ్ గుర్తించిన దైర్యవంతురాలు. అప్పుడు ఈ అమ్మాయి వయసు 9సంవత్సరాలని ట్వీట్ చేశారు.
బాంద్రాలో ఉంటున్న రోటావన్ గురించి విని ఆమెను కలిశాను. కసబ్ గన్ తో ఆమె కాలిపై షూట్ చేశాడని,ఆగాయాన్ని తాను చూసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న ఆమె కుటుంబాన్ని సీఎం ఆదుకోవాలని, తాను సైతం రోటవన్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.
