అరేబియా సముద్రంలో తుఫాన్ : తీరం దాటేది ఎక్కడ.. మనపై ప్రభావం ఎంత..?

అరేబియా సముద్రంలో తుఫాన్ : తీరం దాటేది ఎక్కడ.. మనపై ప్రభావం ఎంత..?

ముప్పు ముంచుకొస్తోంది. భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 21 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు తేజ్గా నామకరణం చేసిన భారత వాతావరణ శాఖ...అక్టోబర్ 22 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. 

అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన రెండో తుఫాను ఇది. ఈ తుఫాను ఒమన్ దేశంతో పాటు..దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ తీరాల వైపు కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి సముద్రంలో  అలలు పోటెత్తడంతో  రాబోయే నాలుగు రోజుల పాటు..అసాధారణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 

నైరుతి అరేబియా సముద్రంలోని అల్పపీడనం పశ్చిమ దిశగా వెళ్లి..అదే ప్రాంతంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒమన్ లోని సోకోట్రాకు తూర్పు ఆగ్నేయంగా 900 కిలో మీటర్ల, ఒమన్ లోని సలాలా విమానాశ్రయానికి ఆగ్నేయంగా 1170 కిలో మీటర్ల వైపు కదులుతోందని ప్రకటించింది. 
ఈ తుఫాను వలన గరిష్టంగా 62 నుంచి 68 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని..గరిష్టంగా గాలి వేగం గంటకు 89 నుంచి 117 కిలో మీటర్లకు చేరుకుంటుందని హెచ్చరించింది. 

Also Read :- ఇద్దరు అమెరికన్ల విడుదల

ఐదు రోజులు వానలే.. 

తేజ్ తుఫాను కారణంగా అక్టోబర్ 23, 24 తేదీల్లో  దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని..కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

అటు అక్టోబర్ 24వ తేదీన నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని ఐఎండీ ప్రకటించింది. అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈ తేజ్ తుఫాను కారణంగా తెలంగాణలో వానల పడే అవకాశం లేదని ఐఎండీ వెల్లడించింది. 

అక్టోబర్ 22వ తేదీన తేజ్ తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నందున మత్య్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది.