న్యూఢిల్లీ: జొమాటో తీసుకురానున్న కొత్త స్కీమ్ ‘10 నిమిషాల్లోనే డెలివరీ’ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఇటువంటి స్కీమ్ల వలన డెలివరీ పార్టనర్లు, రోడ్లపైన ఉండే ప్రజలు ప్రమాదాలకు గురికావొచ్చని మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఫైర్ అయ్యారు. ట్రాఫిక్ రూల్స్ను కంపెనీ ఉల్లంఘించకూడదని, ఇన్స్టంట్ డెలివరీ వలన జొమాటో పార్టనర్లు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించినా, యాక్సిడెంట్స్ చేసినా కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ‘10 నిమిషాలకే డెలివరీ చేయడం అంటే జొమాటో తమ ఉద్యోగులు, రోడ్లపైన ఉండే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే. మధ్యప్రదేశ్లో ఎవరూ ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించకూడదు. తమ ప్లాన్స్ను మార్చుకోవాలని జొమాటోకి గట్టిగా చెబుతున్నాం’ అని మిశ్రా అన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ‘జొమాటో ఇన్స్టంట్’ ను గురుగ్రామ్లోని నాలుగు ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తామని ఈ వారం జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కువగా ఆర్డర్ చేసే ఫుడ్ ఐటెమ్స్ను ముందుగానే రెడీగా ఉంచి, వాటిని వెంటనే డెలివరి చేస్తామని దీపందర్ చెప్పారు. జొమాటో జంక్షన్లను ఏర్పాటు చేస్తామని, వీటి చుట్టుపక్కల ఏరియాల్లో 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేపడతామని అన్నారు. ప్రస్తుతం జొమాటో సగటున 30 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది. దీన్ని 10 నిమిషాలకు తగ్గించడంలో భాగంగానే ‘జొమాటో ఇన్స్టంట్’ తీసుకొస్తున్నామని దీపిందర్ పేర్కొన్నారు. కాగా, ఈ ప్లాన్ను ప్రకటించిన తర్వాత నుంచి కంపెనీపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫుడ్ను అంత తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం ఏముందని, డెలివరీ పార్టనర్లపై ఒత్తిడి పెంచొద్దని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 10 నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారో వివరణ ఇవ్వాలని చెన్నై ట్రాఫిక్ పోలీసులు జొమాటోకి నోటీసులు పంపారు.
