న్యూఢిల్లీ: దివాలా తీసిన ట్రావెల్ కంపెనీ ‘కాక్స్ అండ్ కింగ్స్’లో బడా స్కామ్ జరిగిన విషయం బయటపడింది. కంపెనీ అకౌంట్స్ నుంచి భారీ ఎత్తున ఫండ్స్ దారి మళ్లించినట్టు, నకిలీ అమ్మకాలు జరిపినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ గుర్తించింది. దీని ప్రకారం.. ఈ కంపెనీ160కు పైగా బోగస్ కస్టమర్లకు రూ.9 వేల కోట్ల అమ్మకాలు జరిపింది. తప్పుడు రికార్డులు సృష్టించింది. యెస్ బ్యాంక్ రిక్వెస్ట్ మేరకు ప్రైస్వాటర్ హౌస్కూపర్స్(పీడబ్ల్యూసీ) ఈ ట్రావెల్ కంపెనీపై ఆడిట్ జరిపింది. ఫండ్స్ దారి మళ్లింపు నిజమేనని ఇది తేల్చింది. గత నాలుగేళ్లలో రూ.21 వేల కోట్ల నకిలీ లావాదేవీలు జరిపారని ఇది గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించి రూ.1,100 కోట్ల లోన్ కూడా యెస్ బ్యాంక్ ఈ దివాలా కంపెనీకి ఇచ్చినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ పేర్కొంది. సరైన అనుమతులు లేకుండానే కంపెనీకి, యెస్ బ్యాంక్కు మధ్య చాలా లావాదేవీలు జరిగినట్టు కూడాఆడిట్ గుర్తించింది.
కపూర్ హయాంలోనే..
యెస్ బ్యాంక్ రాణా కపూర్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కాక్స్ అండ్ కింగ్స్ కు విపరీతంగా లోన్లు ఇచ్చినట్టు తేలింది. రూ.2,267 కోట్ల లోన్ను ఒక ట్రావెల్ కంపెనీకి ఇచ్చినట్టు యెస్ బ్యాంక్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యెస్ బ్యాంక్ కూడా కుప్పకూలింది. రాణా కపూర్ కేసుతో సంబంధం ఉన్న కాక్స్ అండ్ కింగ్స్ ప్రమోటర్ అజయ్ అజిత్ పీటర్ ఖేర్కర్కు ఈడీ సమన్లు జారీ చేసింది. బ్యాంక్లకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు రూ.5,500 కోట్లు బాకీ పడిన నేపథ్యంలో 2019లోనే కాక్స్ అండ్ కింగ్స్ దివాలా కోర్టుకి వెళ్లింది. 2014 నుంచి 2019 మధ్యలో కాక్స్ అండ్ కింగ్స్ జరిపిన లావాదేవీలు, అకౌంట్లపై ఫోరెన్సిక్ ఆడిట్ను పీడబ్ల్యూసీ చేపట్టింది. 2017లో దివాలా తీసిన అలోక్ ఇండస్ట్రీస్తో కాక్స్ అండ్ కింగ్స్ కు ఎలాంటి బిజినెస్ రిలేషన్షిప్ లేకున్నా కూడా రూ.1,100 కోట్ల రుణం ఇచ్చినట్టు పేర్కొంది. 2019 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఎలాంటి లోన్ అగ్రిమెంట్లు లేకుండా 11 పార్టీలకు కాక్స్ అండ్ కింగ్స్ రూ.589 కోట్ల రుణం ఇచ్చింది. సేల్స్ ను ఎక్కువగా చూపి, రుణం తక్కువ చేసి చూపించడానికి కూడా కంపెనీలు పలు తప్పుడు రికార్డులు చేపట్టినట్టు ఆడిట్ రిపోర్టు వెల్లడించింది.
