న్యూఢిల్లీ: వంట నూనెల రంగంలోని పెద్ద కంపెనీలన్నీ పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ రేట్లను తగ్గిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గుముఖం పట్టడంతో ఈ కంపెనీలు దేశీయ మార్కెట్లో రేట్లను 15 శాతం దాకా తగ్గిస్తున్నాయి. ధరల మంటతో బెంబేలెత్తుతున్న వినియోగదారులకు ఇది కొంత ఊరట కలిగించేదే. మార్కెట్లో పాపులర్ బ్రాండ్ల రేట్లు వెంటనే తగ్గుతాయని, ప్రీమియం బ్రాండ్ల రేట్లు తగ్గడానికి కొంత టైము పట్టొచ్చని ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర రావు దేశాయ్ చెప్పారు. ధరల తగ్గుదల ప్రకటనతో డిమాండ్ పుంజుకుంటుందని, డిస్ట్రిబ్యూటర్లు తమ వద్ద స్టాకులను పెంచుకుంటున్నారు. ఫుడ్ ఇన్ఫ్లేషన్లో వంట నూనెల రేట్లు కీలకమైనవి.
మే నెలలో ఎడిబుల్ ఆయిల్, ఫ్యాట్ కేటగిరీ ఇన్ఫ్లేషన్ 13.26 శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా పెరిగిన వంట నూనెల రేట్లు ఇన్ఫ్లేషన్ పెరగడానికీ కారణమయ్యాయి. పామాయిల్ రేట్లు లీటరుకు రూ. 7–8 చొప్పున, సన్ ఫ్లవర్ ఆయిల్ రేట్లు లీటరుకు రూ. 10–15 చొప్పున, సోయాబీన్ ఆయిల్ రేట్లు లీటరుకు రూ. 5 చొప్పున తగ్గినట్లు సుధాకర రావు దేశాయ్ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఎంఆర్పీ (మాగ్జిమమ్ రిటెయిల్ ప్రైస్)నూ తగ్గించేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు మద్దతుగా ప్రభుత్వం కోరడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ఎంఆర్పీతో వంట నూనె ప్యాకెట్లు వారం రోజుల్లో మార్కెట్ను చేరతాయని అదానీ విల్మార్ మేనేజింగ్ డైరెక్టర్ అంగ్షు మాలిక్ అన్నారు. జెమిని ఎడిబుల్స్ తన ఫ్రీడం సన్ఫ్లవర్ ఆయిల్ రేటును కిందటి వారంలో లీటర్పై రూ. 15 తగ్గించింది.
