న్యూఢిల్లీ: కేవలం ఒక నెలలోపే వంటనూనెల రేట్లు 20 శాతానికిపైగా పెరిగాయి. ఇవి ఇంకా పెరుగుతాయని, సప్లై ఉండదంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టడంతో కస్టమర్లు భయపడుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం వల్ల క్రూడాయిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో పెట్రోల్, డీజిల్, వంటనూనెలను పెద్ద ఎత్తున కొని పెట్టుకుంటున్నారు. "వాట్సాప్ మెస్సేజ్లతో నాకు భయమైంది. యుద్ధం కారణంగా వంటనూనె కొరత ఏర్పడుతుందని చదివాను. అందుకే కొనడానికి తొందరపడ్డాను" అని ముంబైకి చెందిన గృహిణి రేఖ చెప్పారు. ఇటీవలే ఆమె 10 లీటర్ల వంట నూనెను కొన్నారు. సాధారణంగా నెలకు ఐదు లీటర్లే కొంటారు. ఇండియా తన వంట నూనెల డిమాండ్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. అంతేగాక రష్యా, ఉక్రెయిన్ నుండి 90శాతం కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటుంది. ఈ నూనె దాని మొత్తం వంటనూనె దిగుమతుల్లో 14శాతం వరకు ఉంటుంది. పామాయిల్, సోయా, ఆవ, వేరుశెనగ వంటి ఇతర వంట ఆయిల్ల సరఫరా సరిపోతుందని, భయపడాల్సిన అవసరం లేదని దిగుమతిదారులు అంటున్నారు.
క్రూడాయిల్ ధరల మంట తప్పదా ?
ఉత్తరప్రదేశ్తో సహా అనేక కీలక రాష్ట్రాలలో ఎన్నికలు ఉండబట్టి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నవంబర్ 4 నుండి ధరలను పెంచలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఓటింగ్ సోమవారం ముగిసింది. ప్రభుత్వం మంగళవారం నుంచే ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తుందని వాట్సాప్ మెసేజ్లు చక్కర్లు కొట్టాయి. ఎన్నికల ముగిశాయి కాబట్టి పెట్రో ధరలు లీటరుకు 15–-20 రూపాయలు పెరిగే అవకాశం ఉందని దేశీయ మీడియా కూడా పేర్కొంది. అందుకే తాను పెద్ద ఎత్తున డీజిల్ను నిల్వ చేసుకుంటున్నట్లు మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ ఫడ్తారే చెప్పారు.
