ఒకసారి కరోనా పాజిటివ్ సోకిన రోగికే మళ్లీ పాజిటివ్ వస్తే ఆ ఫలితాన్ని కొత్తదిగా ప్రకటించొద్దని సీఎం జగన్ సూచించారు. కరోనా వైరస్ టెస్ట్ ల నిర్ధారణ ఆలస్యం అవుతున్న సంఘటనలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని అన్నీ వీఆర్డీఎల్ ల్యాబ్లు ట్రూనాట్ ల్యాబ్లలో నమునా సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నమూనా సేకరణ కౌంటర్లలలో మూడు షిఫ్టులు పనిచేసేలా చూడాలని జిల్లాల జేసీల కు సూచించారు. అలాగే ల్యాబ్లలో సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్లో నమోదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించి నమూనాలను జాగ్రత్త చేయాలని స్పష్టం చేసింది. ఐడీ నెంబరు, సరైన మూత లేకుండా నమూనాల సేకరణ, బాక్సింగ్ లాంటి విధానాలు పాటించకుండా నిర్ధారణా పరీక్షలు చేసేందుకు వీల్లేదని పేర్కొంది. ఫలితాలను ఎంఎస్ఎస్ కోవిడ్ పోర్టల్లో నమోదు చేయకుంటే తిరస్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను ప్రాధాన్యతగా గుర్తించి తక్షణం ఫలితాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎంఎస్ఎస్ కోవిడ్ పోర్టల్, ఐసీఎంఆర్ పోర్టల్లో నమోదు చేసే ఫలితాలు ఆరుగంటలకన్నా ఆలస్యం అయ్యేందుకు వీల్లేదని వీఆర్డీఎల్ ల్యాబ్స్కు సీఎం జగన్ సూచించారు.
