- బీజేపీ లీడర్లను అడ్డుకున్న ఉన్నతాధికారులు
- ఎక్కడికక్కడ అరెస్టులు
- పోలీసు కారును తగులబెట్టిన ఆందోళనకారులు
కోల్కతా : టీఎంసీ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ మంగళవారం చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస జరిగింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కోల్కతాలో సెక్రటేరియట్కు ర్యాలీగా వెళ్తున్న విపక్ష బీజేపీ లీడర్ సువేందు అధికారి, హుగ్లీ ఎంపీ లాకెట్ చటర్జీ సహా ఇతర నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనంతరం వారిని వ్యాన్లో వేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారితో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మార్చ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో హౌరా బ్రిడ్జి వద్ద చేరుకున్న నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన నిరసనకారులు లాల్బజార్లో ఓ పోలీసు కారును తగులబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాణిగంజ్ పీఎస్కు తరలించారు. ఈ ఘటనతో కోల్కతాలో జనజీవనం స్తంభించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేల మంది బీజేపీ కార్యకర్తలు కోల్కతాకు తరలివెళ్లారు.
ప్రశాంతంగా ప్రతిఘటిస్తం
ప్రజల్లో టీఎంసీకి వ్యతిరేకత పెరుగుతున్నదని, దీంతో ఆ పార్టీకి భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ‘‘మా నిరసన ర్యాలీని ప్రభుత్వం ఆపాలని యత్నించినా మేము ప్రశాంతంగా ప్రతిఘటిస్తం. జంగిల్రాజ్పై మా పోరాటం కొనసాగుతది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తది” అని ఘోష్ హెచ్చరించారు. మరో బీజేపీ నేత రాహుల్ సిన్హా మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తాము చేస్తున్న ర్యాలీని బలవంతంగా అడ్డుకునేందుకు మమత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. అలీపూర్దౌర్ నుంచి సెల్దాహ్కు వెళ్లే స్పెషల్ ట్రెయిన్లో బీజేపీ సపోర్టర్లను ఎక్కనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారనిమండిపడ్డారు. అలాగే బీజేపీ కార్యకర్తలను తీసుకెళ్తున్న బస్సులను కూడా ఆపేశారన్నారు. సెక్రటేరియట్ వైపు వెళ్లనివ్వకపోవడంతో బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ హౌరాలో రోడ్డుపై బెఠాయించారు. విపక్ష నేతలు నిరసన తెలిపేందుకూ మమత సర్కారు అనుమతించడంలేదని ఆయన మండిపడ్డారు.
బెంగాల్ను నార్త్ కొరియాలా మార్చింది
పోలీసులు తనను లాక్కుపోయేట పుడు సువేందు అధికారి మాట్లాడుతూ బెంగాల్ను సీఎం మమతా బెనర్జీ నార్త్ కొరియాలా మార్చారని ఫైరయ్యారు. ‘‘సీఎంకు ప్రజల మద్దతు లేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడిలాగే మమత కూడా బెంగాల్ను నియంతలా పాొలిస్తున్నరు. ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్న మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వారు చేసిందానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తది” అని సువేందు అధికారి అన్నారు.
బీజేపీ కార్యకర్తలా? గూండాలా?: టీఎంసీ
కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసకు బీజేపీదే బాధ్యత అని అధికార టీఎంసీ విరుచుకుపడింది. నిరసనలు, ర్యాలీల పేరుతో సాధారణ జనజీవనాన్ని బీజేపీ డిస్టర్బ్ చేసిందని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ ఆరోపించారు. ‘‘ర్యాలీల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వారు బీజేపీ కార్యకర్తలా? గూండాలా? బెంగాల్లో అశాంతి నెలకొల్పేందుకే వారిదంతా చేస్తున్నరు” అని కునాల్ ఆరోపించారు.
