- పాతుకుపోతున్న చైనా కంపెనీలు
- ఫోనల్ మారెక్ట్ లో వీటికి 72 శాతం వాటా
న్యూఢిల్లీ: మనదేశంలో అమ్ముడవుతున్న ప్రతి పది ఫోన్లలో ఏడు ఫోన్లు చైనా కంపెనీలవేనని కౌంటర్ పాయింట్ తాజా స్టడీలో తేలింది. డ్రాగన్ కంపెనీలు ఇక్కడితో ఆగడం లేదు. వాటి దృష్టి ఇప్పుడు ఆటో మార్కెట్ మీద ఉంది. ఫోన్ల మాదిరే చవక ధరల్లో ఎక్కువ ఫీచర్లతో లేటెస్ట్ డిజైన్లతో కార్లను తీసుకొస్తూ మార్కెట్ షేరును పెంచుకుంటున్నాయి. హెక్టర్ పేరుతో ఎస్యూవీలను, ఈవీలను అమ్ముతున్న చైనా ఆటోమేకర్ ఎంజీ మోటార్స్ ఇండియాలో పాతుకుపోవడానికి ఇక్కడ ప్లాంట్లను నిర్మిస్తోంది. 2024 నాటికి ఇండియా జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోడీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంజీ మోటార్స్, గ్రేట్వాల్ వంటి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన ‘ఆటో ఎక్స్ 2020’ను పరిశీలిస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది.
పెద్ద కంపెనీల చూపు ఇండియావైపు..
చైనాలో టాప్ ఆటో కంపెనీలు ఎస్ఏఐసీ (ఎంజీ మోటార్స్ ), బీవైడీ (ఈవీలను, బ్యాటరీలను తయారు చేస్తుంది), గ్రేట్వాల్ (చైనా అతిపెద్ద ఎస్యూవీ మేకర్), ఎఫ్ఏడబ్యూ హైమా ఇండియా ఆటో మార్కెట్ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. అమ్మకాలు లేక ఇండియా ఆటో కంపెనీలు కుదేలవుతుండగా, చైనా కంపెనీలు మాత్రం ఇక్కడ కస్టమర్లపై బోలెడు ఆశలు పెట్టుకుంటున్నాయి. హెక్టర్ ఎస్యూవీకి ఇప్పటికే 20 వేల ఆర్డర్లు ఉన్నాయంటే దీనికి ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఈ కారు కోసం కస్టమర్లు నెలల తరబడి ఎదురుచూస్తుండటం విచిత్రం. అంతేకాదు హెక్టర్కు బాగా ఆదరణ రావడంతో ఈ కంపెనీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని కూడా లాంచ్ చేసింది. స్థానిక కంపెనీలతో కలసి చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది.
ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయ్..
గ్రేట్ వాల్ వచ్చే ఏడాది జూన్లోపే మహారాష్ట్రలో ప్లాంటును మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా నుంచి జనరల్ మోటార్స్ వెళ్లిపోయాక, మహారాష్ట్రలోని ఖాళీగా ఉన్న దాని ప్లాంటును గ్రేట్ వాల్ కొన్నది. గ్రేట్వాల్తోపాటు చంగన్ అనే మరో చైనా కంపెనీ సైతం ఇండియాలో ప్రొడక్షన్ కోసం ప్లాన్లను రెడీ చేసుకుంటోంది. కొంతమంది సప్లయర్లతో మాట్లాడింది కూడా. ఇండియాలోనూ ఈవీ బ్యాటరీ అసెంబ్లీ ప్లాంట్లను పెట్టాలా ? అనే ప్రపోజల్స్ను కూడా స్టడీ చేస్తున్నాయి. ఇండియాలో ఎలక్ట్రిక్ బైకులను తయారు చేసేందుకు మరో చైనా కంపెనీ సన్రా కూడా ఆసక్తి చూపుతోంది. నాలుగైదు సంవత్సరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇండియాలో త్వరలో ఆరు ఈ–బైకులను విడుదల చేయనుంది. 2023 నాటికి ఈవీల మార్కెట్ రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే చైనా కంపెనీలు ఈవీలపై ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాదు, 2026 నాటికి మనదేశం ప్రపంచంలోనే మూడోఅతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

