హైదరాబాద్, వెలుగు: నగరంలోని రెడ్ హిల్స్లో ఇటీవలే ప్రారంభమైన ఎఫ్టీసీసీఐ పోకర్ణ స్కిల్ సెంటర్ ‘ఎగుమతి– దిగుమతి నిర్వహణ’ సర్టిఫైడ్ కోర్సును ప్రారంభించింది. ఇది ఆరు రోజుల కార్యక్రమం కాగా, మార్చి వరకు ప్రతి శనివారం ఒకసారి నిర్వహిస్తారు. ప్రోగ్రామ్లో మొత్తం 40 మంది పాల్గొంటారు. కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎగుమతిదారులకు సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా కీలకమని అన్నారు.
మనదేశం మునుపటి ఆర్థిక సంవత్సరంలో సరుకులు, సేవలలో 670 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం చేసిందని అన్నారు. ఎగుమతులు 35 శాతం పెరిగాయని చెప్పారు. వీటిలో 420 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు, 250 బిలియన్ డాలర్ల విలువైన సేవలు ఉన్నాయని చెప్పారు. కరోనా కారణంగా టూరిజం, ఏవియేషన్, రవాణా, లాజిస్టిక్స్ వంటి అనేక సేవా రంగాలను ప్రతికూలంగా ప్రభావితం చేసినప్పటికీ భారీగా ఎగుమతులను సాధించామని చెప్పారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకున్నామని ఖాన్ వివరించారు.
