వస్తుసేవల పన్ను (GST) చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించడాన్ని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (CAG) తప్పుబట్టింది. గత రెండేళ్లుగా రాష్ట్రాలకు GST పరిహార పన్ను చెల్లించకుండా తన వద్దే అట్టిపెట్టుకున్నట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోయిన సమయంలో నిధులు సమకూర్చేందుకు వీలుగా GST రూపంలో వసూలు చేస్తున్న దాంట్లో కొంత మొత్తాన్ని పరిహారం పన్ను కింద చెల్లించాలని 2017 నాటి GST చట్టం చెబుతోందని చెప్పింది. అయితే మొదటి రెండేళ్లలో రూ.47,272 కోట్ల పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించకుండా తన దగ్గరే పెట్టుకుందని తేలిందని చెప్పింది. ఇది GST చట్టాలను ఉల్లంఘించడమనేనని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2017-18లో GST పరిహార పన్ను రూ.62,612 కోట్లు వసూలు చేయగా… వాటిలో రూ.56, 146 కోట్లు ఉపయోగించని ఫండ్ కింద జమ చేసింది. తర్వాత ఏడాది రూ. 95,081 కోట్లు పరిహారం రూపంలో వసూలు కాగా, రూ.54, 275 కోట్లను ఉపయోగించని ఫండ్కు బదిలీ చేసింది. ఈ రెండేళ్లలో బదిలీ చేయని మొత్తం రూ.47, 272 కోట్లను తన దగ్గరే అట్టిపెట్టుకుందని కాగ్ గుర్తించింది.
