- విప్లవ కవి నిఖిలేశ్వర్కి కేంద్ర సాహిత్య పురస్కారం
- ‘అగ్నిశ్వాస’ కవితా సంపుటికి ప్రకటించిన అకాడమీ
- మొత్తం 20 భాషల్లో అవార్డులు
- యువ, బాల సాహిత్యంలో మానస ఎండ్లూరి, కన్నెగంటి అనసూయకూ పురస్కారాలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ బిడ్డ, విప్లవ కవి నిఖిలేశ్వర్ (82) ను ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రాసిన ‘అగ్నిశ్వాస’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 20 అధికార భాషల్లో రచయితలకు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించింది. తెలుగు కేటగిరీలో నిఖిలేశ్వర్కు ఈ పురస్కారం దక్కింది. నిఖిలేశ్వర్ అనేది కలం పేరు కాగా.. ఆయన అసలు పేరు కుంభం యాదవ రెడ్డి. యాదాద్రి జిల్లాలోని వీరవల్లి ఆయన సొంతూరు. ఇక ఏపీకి చెందిన మానస ఎండ్లూరి ‘మిళింద’ (లఘు కథ)కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రాగా, కన్నెగంటి అనసూయ ‘స్నేహితులు’ (లఘు కథ)కు బాల సాహిత్యం విభాగంలో అవార్డు దక్కింది.
కన్నడలో వీరప్ప మొయిలీకి..
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీకి కన్నడ కేటగిరీలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆయన రచించిన ‘శ్రీ బహుబలి అహింస దిగ్విజయం’ పుస్తకానికి ఈ పురస్కారం వచ్చింది. ప్రముఖ రచయిత్రి అరుంధతి సుబ్రమణ్యం రాసిన ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’కు కూడా ఇంగ్లీషులో పురస్కారం లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వారికి రూ.లక్ష ప్రైజ్ మనీతో పాటు జ్ఞాపిక ఇస్తామని, యువ, బాల సాహిత్యం విభాగంలో అవార్డులు పొందిన వారికి రూ.50 వేలు ప్రైజ్ మనీ ఇస్తామని అకాడమీ వెల్లడించింది.
