ISI మార్కు లేని వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్నఈ-కామర్స్ పోర్టళ్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు అలాంటి వస్తువులను కొనొద్దంటూ ప్రజలను హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు.. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా అమ్మకాలకు పాల్పడుతున్న ఈ-కామర్స్ పోర్టళ్లపై సూమోటోగా చర్యలు చేపడుతూ 15 నోటీసులు జారీ చేసినట్టు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తెలిపింది.
వినియోగదారుల రక్షణ ఛట్టం 2019లోని సెక్షన్ 18(2) ప్రకారం CCPA ఈ మేరకు వినియోగదారులకు సేప్టీ నోటీసు విడుదల చేసింది. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం గృహోపకరణాలు, ఇతర వస్తువులను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతతో తయారు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రమాణాలు లేని వస్తువుల తయారీ, దిగుమతి, పంపిణీ, అమ్మకం, అద్దెకు తీసుకోవడం, నిల్వచేయడం, ప్రదర్శించడం నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి కనీసం రెండేళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించే అవకాశం ఉంది. అదే నేరాన్ని మళ్లి చేస్తే అమ్మిన సరుకు విలువకు 10రెట్లు వరకు జరిమానా విధించవచ్చు.
ముఖ్యంగా ఇళ్లల్లో వినియోగించే ప్రెజర్ కుక్కర్లు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, ద్విచక్రవాహనదారులు వినియోగించే హెల్మెట్లు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేనట్లయితే వినియోగదారులకు ప్రాణాపాయం కూడా పొంచి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మూడు వస్తువుల విషయంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేస్తూ CCPA లేఖలు రాసింది. ISI మార్కు లేని వస్తువుల తయారీ,అమ్మకాలపై నిఘా పెట్టాలని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
మరిన్ని వార్తల కోసం..
పండుగ సీజన్ ముందు తగ్గిన వంట నూనెల రేట్లు
