స్కాలర్షిప్ల కోసం రూ.59 వేల కోట్లు
ఎస్సీ స్టూడెంట్లకు ఇవ్వనున్న కేంద్రం
4 కోట్ల మందికి లాభం
డీటీహెచ్ సెక్టార్లో ఇక 100 % ఎఫ్డీఐలు
కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఎస్సీ స్టూడెంట్లకు ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను కేంద్రం భారీగా పెంచింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 4 కోట్ల మందికి పైగా ఎస్సీ స్టూడెంట్లకు రూ. 59 వేల కోట్ల స్కాలర్షిప్లు అందించాలని నిర్ణయించింది. ఈ మొత్తంలో 60 శాతం(35,534 కోట్లు) కేంద్ర ప్రభుత్వ వాటా కాగా మిగతా మొత్తం ఆయా రాష్ట్రాలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈమేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. స్కాలర్షిప్లను పెంచడం ద్వారా ఎస్సీ కమ్యూనిటీలోని నిరుపేద కుటుంబాలకు చెందిన స్టూడెంట్లలో పై చదువులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని కేంద్ర కేబినెట్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. వెనకబడిన తరగతులకు చెందిన స్టూడెంట్లకు కూడా నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది. ఈ స్కీంలో భాగంగా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పదో తరగతి పాసైన స్టూడెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామని, వారు కోరుకున్న పై చదువులకు ఆర్థిక సాయం అందిస్తామని వివరించింది.
డీటీహెచ్ లైసెన్స్ 20 ఏండ్ల దాకా..
డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్(డీటీహెచ్) గైడ్లైన్స్ను కూడా కేబినెట్ సవరించింది. ఇప్పటి వరకు 10 ఏండ్లకు ఇస్తున్న లైసెన్స్ విధానాన్ని మార్చి 20 ఏండ్ల వరకు ఒకేసారి కేటాయించేలా చేసిన సవరణలకు ఆమోదం తెలిపింది. లైసెన్స్ ఫీజును ఏడాదికి ఓసారి కాకుండా మూడు నెలలకు ఓసారి చొప్పున వసూలు చేసేలా మార్పులు చేశామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. అదేవిధంగా డీటీహెచ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ సెక్టార్లో ఇకపై వందకు వంద శాతం ఎఫ్డీఐలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సెక్టార్లో ఎఫ్డీఐలను ప్రభుత్వం కేవలం 49 శాతానికే పరిమితం చేసిందని, తాజాగా దీనిని వంద శాతానికి పెంచామని జవదేకర్ వివరించారు.
For More News..
కరోనా టీకా కొవిషీల్డ్ వచ్చేవారమే!
కరోనా వ్యాక్సిన్.. ఇంట్రెస్ట్ చూపించని జనం
