హైదరాబాద్, వెలుగు : దాదాపు 90 దేశాలకు కాఫీ ఎగుమతి చేస్తున్న సీసీఎల్ ప్రొడక్ట్స్ కాంటినెంటల్ పేరుతో దేశీయ మార్కెట్లోనూ అడుగుపెడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ లేబుల్ ఇన్స్టెంట్ కాఫీ మాన్యుఫాక్చరర్గా పేరొందిన ఈ కంపెనీ, ఇప్పుడు ఇండియాలో ఇన్స్టంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, కాఫీ ప్రి మిక్స్లను ప్రవేశపెడుతోంది. నాలుగు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లున్న సీసీఎల్ ప్రొడక్ట్స్ 2018–19 లో రూ. 1100 కోట్ల టర్నోవర్ సాధించింది.
ఈ ఏడాది 15 నుంచి 20 శాతం వృద్ధి సాధించగలమని అంచనా వేస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీశాంత్ చెప్పారు. రెండు యూనిట్లు ఇండియాలోను, వియత్నాం, స్విట్జర్లాండ్లలో చెరొకటి సీసీఎల్ ప్రొడక్ట్స్ నెలకొల్పింది. దుగ్గిరాల వద్ద యూనిట్కు ఏటా 35 వేల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఇటీవలే సూళ్లూర్పేట్ సమీపంలో మరో కొత్త యూనిట్ ఉత్పత్తి మొదలు పెట్టింది.
ఈ ఏడాది కూడా విస్తరణ ప్రాజెక్టులు చేపడుతున్నామని, ఇందుకు 20 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నామని ఛైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ తెలిపారు. కాఫీ ఎక్కువగా తాగే దక్షిణాది రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నామని, 600 మందిని ఇప్పటికే నియమించామని చెప్పారు. ఇండియాలో అమ్మకాల ద్వారా రూ. 100 కోట్ల టర్నోవర్ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. ఆన్లైన్లోనూ అమ్మకాలు సాగిస్తున్నామని, అమెజాన్–ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా టర్నోవర్లో 5 శాతం వస్తోందని వెల్లడించారు. ఆన్లైన్ అమ్మకాలు ఏటేటా పెరుగుతున్నాయన్నారు. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టేందుకు మార్కెట్ను ఆరు నెలలపాటు అధ్యయనం చేశామని, ఒక కాఫీ బ్రాండ్కు అలవాటు పడిన వారు మారడం కొంత కష్టమేనని తేలిందని చెప్పారు.
వెయ్యి కాఫీ రిసైప్స్ను విదేశాలలో కస్టమర్లకు అందిస్తున్న అనుభవంతో ఇండియా మార్కెట్కు అందుబాటు ధరల్లో ఇక్కడి అభిరుచులకు తగినట్లుగా కాఫీ అందించనున్నట్లు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఇండియాలో ఇన్స్టెంట్ కాఫీ మార్కెట్ విలువ రూ. 2 వేల కోట్లు, ఫిల్టర్ కాఫీ మార్కెట్ విలువ రూ. 500 కోట్లుగా ఉందని చెప్పారు. కాఫీ మార్కెట్ ఏటా 7–10 శాతం చొప్పున పెరుగుతోందని అన్నారు. యూఎస్లో ఏటా 80 వేల టన్నుల కాఫీ వినియోగమవుతుందని, రాబోయే కొన్నేళ్లలో అక్కడ పట్టు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టామని వెల్లడించారు. కాఫీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాజిడర్గా ప్రముఖ సినీ నటి నిత్యా మీనన్ను నియమించుకున్నామని, ఆగస్టు 15 నుంచి ఈ కమర్షియల్స్ ప్రసారమవుతాయని శ్రీశాంత్ తెలిపారు. 24 ఏళ్ల కిందట ఏటా 3600 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో సీసీఎల్ ప్రొడక్ట్స్ తన జర్నీ మొదలుపెట్టిందని రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు.
