న్యూఢిల్లీ: బ్యాంకు మోసం కేసులో అభిజిత్ గ్రూప్ ప్రమోట్ చేసిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కంపెనీ, దాని ప్రమోటర్లు రూ. 4 వేల కోట్ల మేర బ్యాంకు మోసాలకు పాల్పడ్డారనేది ఆరోపణ. గురువారం నాడు 16 ప్రాంతాలలో కంపెనీ ఆఫీసులను సీబీఐ సెర్చ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోల్కత్తాకు చెందిన ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కంపెనీ కార్పొరేట్ పవర్ లిమిటెడ్ను అభిజిత్ గ్రూప్ నెలకొల్పింది. జార్ఖండ్లో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది కంపెనీ ప్రతిపాదన. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ఆఫీసర్లు చెప్పారు. 20 బ్యాంకుల కన్సార్టియమ్ను కంపెనీ ప్రమోటర్లు మోసగించినట్లు పేర్కొన్నారు. అభిజిత్ గ్రూప్కంపెనీలలోని చాలా మంది డైరెక్టర్లు ఇప్పటికే ఇతర సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
కోల్ స్కామ్ కేసులలోనూ వారు నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ కేసులలో ఛార్జ్షీట్లు కూడా ఫైలయ్యాయని అన్నారు. కార్పొరేట్ పవర్ లిమిటెడ్ను మొదట్లో చితాపుర్ కోల్ అండ్ పవర్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేశారు. జార్ఖండ్లో రూ. 2,900 కోట్ల ఖర్చుతో 540 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ఈ కంపెనీ నెలకొల్పవలసి ఉందని సీబీఐ ఆఫీసర్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పులు తీసుకోవడానికి 2009–2013 మధ్య కాలంలో ప్రాజెక్టు ఖర్చును పెంచేసి ప్రాజెక్టు రిపోర్టులను బ్యాంకులకు సబ్మిట్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు కూడా చెబుతోంది. మనోజ్ జైశ్వాల్, అభిషేక్ జైశ్వాల్, అభిజిత్ జైశ్వాల్లు ఈ కంపెనీ ప్రమోటర్లు.
