నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఇద్దరు బెంగాల్ మంత్రులతో పాటు మరో ఇద్దరు నాయకులకు బెయిల్ మంజూరయ్యింది. అంతకుముందు సీబీఐ కార్యాలయం ఎదుట.. వారి అరెస్టును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రోజులో ఎక్కువ భాగం సీబీఐ ఆఫీసు దగ్గరే ఉన్నారు. తనను కూడా అరెస్టు చేయాలని సీబీఐ అధికారులకు సవాల్ విసిరారు.
ఇవాళ(సోమవారం) ఉదయం నారదా కుంభకోణం కేసులో ఇటీవలే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ తృణమూల్ నేత సోవణ్ ఛటర్జీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకన్నారు. వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీతో సహా తృణమూల్ వర్గాలు సీబీఐ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
