- నియమించుకోనున్న క్యాప్జెమిని
- ఏడాదికి రూ. 3.8 లక్షల ప్యాకేజి
- ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఇంకా ఎక్కువ
ప్రాన్స్కు చెందిన ఐటీ దిగ్గజం క్యాప్జెమిని, ఈ ఏడాది మొత్తంగా 12,000–15,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. వీరిని కాలేజ్ క్యాంపస్ల ద్వారా నియమించుకోనుంది. వీరికి సగటు వార్షిక వేతనం రూ. 3.8 లక్షలు ఆఫర్ చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ స్టూడెంట్లకు ఈ ప్యాకేజి రూ. 6.5 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం క్యాప్జెమిని ఇండియన్ బ్రాంచులలో 1.2 లక్షల మంది పనిచేస్తున్నారు. కంపెనీకి ఉన్న మొత్తం ఉద్యోగులలో సగం మంది ఇండియన్ బ్రాంచులలో పనిచేస్తుండడం విశేషం. గత ఏడాది కూడా క్యాప్జెమిని ఇంతే మొత్తంలో ఫ్రెషర్లను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకుంది.
5జీ టెక్నాలజీపై దృష్టి..
కంపెనీ 5జీ టెక్నాలజీపై పోకస్ పెట్టిందని క్యాప్జెమిని ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ అన్నారు. దీని కోసం ముంబై, పారిస్లో రెండు ల్యాబ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కంపెనీ 5జీ, కమ్యునికేషన్ బిజినెస్ను నడిపించడానికి ఎయిర్టెల్ వైస్ ప్రెసిడెంట్ మోనికా గూప్తాను కంపెనీ వీపీగా నియమించుకుంది. మొత్తంగా ఇండియాలో ఈ కంపెనీకి 200 మంది వైస్ ప్రెసిడెంట్లు, 26 మంది గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(జీఈసీ)లు ఉన్నాయి. ఈ కంపెనీతో పాటు అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది 20 వేల మంది విద్యార్ధులను కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. వీరి కోసం వార్షికంగా సగటున రూ. 4,00,000 వేతన ప్యాకేజిని అందిస్తోంది.
