- రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
- బాయ్ కాట్ చేస్తామన్న 16 పార్టీలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సారి రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి దశ, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండోదశ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసే ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తామని 16 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి.
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి దశ, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండోదశ సమావేశాలు జరగనున్నాయి. పూర్తిగా కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రెసిడెంట్ ప్రసంగానికి వెళ్లం: ప్రతిపక్షాల నిర్ణయం
బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసే ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తామని16 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గురువారం ఓ ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేసింది. కాంగ్రెస్ సహా 16 పార్టీలు ప్రెసిడెంట్ స్పీచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. కేంద్రం ఏకపక్షంగా అగ్రి బిల్లులను పాస్ చేసుకుందని ఆజాద్ ఆరోపించారు. కొత్త చట్టాల కారణంగా ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దాదాపు 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, ఇప్పటివరకు 155 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రిపబ్లిక్డే రోజున జరిగిన అల్లర్లను ఖండిస్తున్నామని, ఈ గొడవ వెనుక ఎవరున్నారో తేల్చాలని అవసరం ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ప్రతిపక్షాలు మరోసారి ఆలోచించాలి
రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్కాట్ చేయడం దురదృష్టకరం. వాళ్లు మరోసారి ఆలోచించాలి. రాష్ట్రపతి ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రతి పక్షాలు లేవనెత్తే ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. – కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
