- ఎస్స్ దీనివల్ల రూ.7 వేల కోట్లు ఆదా
- వచ్చే నెల 3 వరకు అందుబాటు
- లక్ష మంది ఉద్యోగులు ఈ స్కీమ్ కు అర్హులు
- 80 వేల మంది అప్లై చేసే అవకాశం
కొన్ని రోజుల నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కొనసాగుతోన్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్… తన ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ను(వీఆర్ఎస్ను) ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ను సుమారు 70 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంటే మొత్తంగా బీఎస్ఎన్ఎల్ వేజ్ బిల్లులో రూ.7 వేల కోట్ల మేర ఆదా అవుతుంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ పీకే పుర్వార్ చెప్పారు. వీఆర్ఎస్ స్కీమ్ గురించి ఇప్పటికే ఫీల్డ్ యూనిట్లలోని ఉద్యోగులకు తెలియజేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 1.50 లక్షల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో లక్ష మంది వరకు వీఆర్ఎస్ స్కీమ్కు అర్హులు. ‘ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న బెస్ట్ వీఆర్ఎస్ స్కీమ్ ఇది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దీన్ని పాజిటివ్ కోణంలో చూడాలి’ అని పుర్వార్ చెప్పారు. ఈ స్కీమ్ను 70 వేల మంది నుంచి 80 వేల మంది ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
50 ఏళ్లు పైబడినవారికి మాత్రమే
బీఎస్ఎన్ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ 2019 ప్రకారం, కంపెనీకి చెందిన 50 ఏళ్లు, ఆపై బడిన వయసు ఉన్న రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులందరూ( డిప్యుటేషన్ మీద ఇతర ఆర్గనైజేషన్లకు వెళ్లిన వారు లేదా బీఎస్ఎన్ఎల్కు వెలుపల పోస్ట్ అయిన వారు కూడా) ఈ స్కీమ్ కింద వాలంటరీ రిటైర్మెంట్ కోరవచ్చు. అర్హులైన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా కింద సర్వీసు పూర్తయిన ప్రతేడాది 35 రోజుల వేతనాన్ని, మిగిలి ఉన్న సర్వీసుకు ప్రతేడాది 25 రోజుల శాలరీని అందజేస్తారు. మరో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్ఎల్ కూడా తన ఉద్యోగుల కోసం వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. 2019 డిసెంబర్ 3 వరకు ఈ స్కీమ్ ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది. 2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు లేదా ఆపై బడిన రెగ్యులర్, పర్మినెంట్ఉద్యోగులందరూ ఈ స్కీమ్ను ఎంచుకునేందుకు అర్హులని ఎంటీఎన్ఎల్ ఇటీవలే ఒక నోటీసు జారీ చేసింది.
గత నెలలోనే రూ.69వేల కోట్ల ప్యాకేజీ…
గత నెలలోనే ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు రూ.69వేల కోట్ల రివైవల్ ప్యాకేజీని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనిలో ఈ రెండు కంపెనీల విలీనం కూడా ఉంది. ఆస్తులను మానిటైజ్ చేయడం(నగదుగా మార్చుకోవడం), ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ ఇవ్వడం వంటివి ఉన్నాయి. ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనానికి కేంద్ర కేబినెట్ కూడా ఓకే చెప్పింది. ఎంటీఎన్ఎల్ గత 10 ఏళ్లలో తొమ్మిదేళ్లు నష్టాలనే పోస్ట్ చేయగా.. బీఎస్ఎన్ఎల్ 2010 నుంచి నష్టాలను మూటకట్టుకుంటోంది. ఈ రెండు కంపెనీల మొత్తం రుణం రూ.40 వేల కోట్లు ఉంటుంది. దీనిలో సగం రుణం ఎంటీఎన్ఎల్దే.

