బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌కు మంచిరోజులొస్తాయ్​: సీఎండీ పీకే పుర్వార్‌‌

బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌కు మంచిరోజులొస్తాయ్​:  సీఎండీ పీకే పుర్వార్‌‌
  • వచ్చే నెలలోనే రివైవల్​ ప్లాన్​
  • త్వరలోనే 4జీ సేవలను ప్రారంభిస్తాం
  • సీఎండీ పీకే పుర్వార్‌‌ ప్రకటన

న్యూఢిల్లీ:

జీతాలకు కూడా డబ్బుల్లేని దుస్థితికి వచ్చిన ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరికొన్ని నెలల్లో సమస్యలన్నింటినీ తీర్చేస్తామని, ఇందుకోసం వచ్చే నెల రివైవల్‌‌ ప్లాన్‌‌ను ప్రకటిస్తామని బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ సీఎండీ పీకే పుర్వార్‌‌ సోమవారం వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కాబట్టి వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయని చెప్పారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4జీ సేవలను ప్రారంభిస్తాం. ఈ క్యాలెండర్‌‌ సంవత్సరంలోనే ప్రభుత్వం మాకు 4జీ స్పెక్ట్రం ఇస్తుందని అనుకుంటున్నాం. రివైవల్‌‌ ప్యాకేజీ గురించి మొత్తం సమాచారాన్ని వచ్చే నెల అందరికీ తెలియజేస్తాం’’ అని వివరించారు. 4జీ మార్కెట్‌‌ను ఏలుతున్న జియో వంటి కంపెనీలతో పోటీ పడాలంటే బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు 4జీ నెట్‌‌వర్క్‌‌ను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. అయితే ఈ కంపెనీ 2010 నుంచి నష్టాల్లో మూలుగుతోంది. దీని ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని ప్రభుత్వం ప్రకటించింది.  స్పెక్ట్రం ఇవ్వాలని, అదివ్వడానికి అవసరమయ్యే రూ. 6,767 కోట్లను ఈక్విటీగా పరిగణించాలని కూడా  బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ మోడీ ప్రభుత్వాన్ని కోరింది.ఆర్థిక పరిస్థితి బాగా లేక కొన్నిసార్లు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక బీఎస్​ఎన్​ఎల్​ చేతులు ఎత్తేసింది. వెండర్లకూ  బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఆస్తులను అమ్మేస్తారు..

బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ రివైవల్‌‌ ప్లాన్‌‌పై డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికం (డాట్‌‌) కసరత్తు చేస్తోంది. కంపెనీ ఆదాయంలో మెజారిటీ వాటా జీతభత్యాలకే ఖర్చవుతున్నందున ఉద్యోగులకు వాలంటరీ రిటైర్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌ (వీఆర్‌‌ఎస్‌‌) అమలు చేయాలని ప్రతిపాదించింది. ఆదాయం పెంచుకోవడానికి ఆస్తులను అమ్మేయాలని సూచించింది. బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు రూ.70 వేల కోట్ల విలువైన భూములు, రూ.3,760 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. వీఆర్‌‌ఎస్‌‌ ప్యాకేజీకి నిధుల కోసం రూ.6,365 కోట్లను నగదు, బాండ్లను రూపంలో సమకూర్చాలని డాట్‌‌ అనుకుంటోంది. ఈ సంస్థలో ప్రస్తుతం 1.76 లక్షల మంది పనిచేస్తున్నారు.

బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ వినియోగదారులకు త్వరలో యుప్ టీవీ సేవలు

ట్రిపుల్ ప్లే సర్వీసుల కోసం బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ యుప్ టివి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పంద పత్రాలపై బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వార్ ,యుప్ టివి వ్యవస్థాపకులు,సీఈఓ ఉదయ్ రెడ్డి సంతకాలు చేశారు. దీంతో యుప్ టివి ద్వారా బీఎస్ఎన్ఎల్ మొబైల్,బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు  వీడియో ఎంటర్​టైన్​మెంట్​ సర్వీసులు చేరువ కానున్నాయి. రెండు వందలకు పైగా లైవ్ టీవీ చానెల్స్,పది రోజుల కాచ్ అప్ టీవీ,2500 పైగా సినిమాలు, ఫస్ట్ డే ఫస్ట్ షో,యుప్ టీవీ ఒరిజినల్స్,పదికి పైగా భాషల్లో అపరిమిత వీడియో ఎంటర్​టైన్​మెంట్​ సర్వీసులను యుప్ టీవీ అందిస్తోంది.

Read more

BSNL revival package coming in one month: CMD