న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ రివైవల్ కోసం రూ. 1.64 లక్షల కోట్లతో ప్యాకేజ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే నాలుగేళ్లలో అమలయ్యే ఈ రివైవల్ ప్యాకేజ్కు కేబినెట్ ఆమోదం వచ్చినట్లు టెలికం మినిస్టర్ అశ్వని వైష్ణవ్ చెప్పారు. సర్వీసులను అప్గ్రేడ్ చేయడానికి, స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం, బ్యాలెన్స్ షీటును మెరుగుపరచడానికి ఈ తాజా క్యాపిటల్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, భారత్ బ్రాడ్ బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడానికి కూడా ఈ ఫండ్స్ వాడొచ్చని చెప్పారు. బీఎస్ఎన్ఎల్కు ఇచ్చే రూ. 1.64 లక్షల కోట్లలో రూ. 43,964 కోట్లు నగదు రూపంలో ఉంటుందని, మిగిలిన రూ. 1.2 లక్షల కోట్లను ఇతర రూపంలో ఇవ్వనున్నామని మంత్రి పేర్కొన్నారు. 4 జీ సేవలు అందించడానికి అవసరమైన స్పెక్ట్రమ్ను కూడా బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం సమకూర్చనుందని అన్నారు. 900,1800 మెగాహెట్జ్ బ్యాండ్లో స్పెక్ట్రమ్ను ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ. 44,993 కోట్లు ఖర్చవుతుంది. దీనిని ఈక్విటీ క్యాపిటల్ రూపంలో అందించనున్నారు. 4 జీ టెక్నాలజీ స్టాక్ డెవలప్మెంట్ కోసం బీఎస్ఎన్ఎల్కు రూ. 22,471 కోట్లను ఇవ్వనున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను వచ్చే నాలుగేళ్లలో అందించనున్నట్లు పేర్కొన్నారు. మరో రూ. 13,789 కోట్లను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తామన్నారు. లాభం రాని రూరల్ వైర్లైన్స్ను 2014–15 నుంచి 2019–20 మధ్య కాలంలో బీఎస్ఎన్ఎల్ నిర్వహించినందుకుగాను ఈ ఫండింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. బ్యాలెన్స్ షీట్ను పటిష్టం చేసేందుకు మరో రూ. 33,404 కోట్లను ఇచ్చి, దానిని ఈక్విటీగా మారుస్తామని పేర్కొన్నారు. ఇప్పుడున్న అప్పులు తీర్చేందుకు కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి సావరిన్ గ్యారంటీ ఇస్తారు. భారత్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగ్గా వాడుకునేందుకు బీబీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేస్తారు. దేశంలోని టెలికం సర్వీస్ ప్రొవైడర్లందరికీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకునే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.
