- నిఫ్టీ 215 పాయింట్లు డౌన్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్లో అమ్మకాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఒక శాతానికి పైగా పడిపోయింది. చాలా షేర్లు నేలచూపులు చూశాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 801.67 పాయింట్లు క్షీణించి 71,139.90 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 865.85 పాయింట్లు తగ్గి 71,075.72 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 215.50 పాయింట్లు పతనమై 21,522.10 వద్దకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ పెట్టుబడిదారులను నిరాశపర్చడంతో ఈ షేరు 5.03 శాతం పడిపోయింది. టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎన్టీపీసీ షేర్లు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి.
టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో, టోక్యో సానుకూలంగా ముగియగా, సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.21 శాతం పెరిగి 82.57 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు సోమవారం రూ. 110.01 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.
