కోల్కతా: మేజర్ టెల్కో ఆపరేటర్లంతా రీచార్జ్ రేట్లను 20 శాతం పెంచాయని, తామూ ఇదే బాట పట్టక తప్పదని బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్లు అంటున్నారు. ప్రస్తుతం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని, టారిఫ్ను తప్పకుండా పెంచాలని చెబుతున్నారు. టెలికం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) మాదిరే బ్రాడ్బ్యాండ్ కంపెనీల ఏఆర్పీయూ కూడా పెరగాలని కోల్కతాకు చెందిన మేఘ్బేలా బ్రాడ్బ్యాండ్ కో–ఫౌండర్ తపవ్రతా ముఖర్జీ అన్నారు. ఇప్పుడున్న ధరలను కనీసం 15–20 శాతం వరకైనా పెంచడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఓటీటీ యాప్స్ కారణంగా కస్టమర్లు డేటాను విపరీతంగా వాడటంతో తమ నెట్వర్క్లపై చాలా భారం పడుతోందని చెప్పారు. అయితే తాము చిన్న ఆపరేటర్లం కాబట్టి టారిఫ్లను పెంచలేమని, ఎయిర్టెల్, జియో వంటి ఆపరేటర్లు తమకు సహకరిస్తేనే పెంపు సాధ్యమని కోరారు. అయితే, ఈ దిశగా పెద్ద కంపెనీల నుంచి సంకేతాలు రావడం లేదని ముఖర్జీ అన్నారు.
