న్యూఢిల్లీ: ఇండో-చైనా బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా దూకుడు పెంచడంతో దీటుగా బదులివ్వడానికి భారత్ సన్నద్ధమవుతోంది. డ్రాగన్ ముప్పును ఎదుర్కోవడానికి భారత్ తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీసింది. 500 కి.మీ.ల రేంజ్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్, 800 కి.మీ.ల రేంజ్ నిర్భయ్ క్రూయిజ్ మిసైల్స్తోపాటు ఆకాశ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ (ఎస్ఏఎమ్)ను సరిహద్దుల్లో మోహరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది. మరోవైపు టిబెట్ రీజియన్లో చైనా 2 వేల కి.మీ.ల రేంజ్ ఎస్ఏఎమ్లను మోహరించిందని సమాచారం. ఒకవేళ చైనా దాడికి పాల్పడితే సూపర్సోనిక్ బ్రహ్మోస్, సబ్సోనిక్ నిర్భయ్తోపాటు ఆకాశ్తో దీటుగా బదులిచ్చేందుకు భారత్ సన్నద్ధమవుతోందని నేషనల్ మీడియా ప్రకారం తెలుస్తోంది. భారత్ ఇప్పటికే బ్రహ్మోస్తోపాటు అవసరమైన సిబ్బందిని లడఖ్ సెక్టార్లో మోహరించిందని సమాచారం.
