మనదేశంలో ఏడాదికి కోటి పైగా ఆదాయం పొందుతున్న సీఏలు, డాక్టర్లు ఎంత మంది ఉన్నారో తెలుసా? కేవలం 2, 200 మంది మాత్రమే ఉన్నారట. వాళ్ల ట్యాక్స్ రిటర్న్స్ ద్వారా ఈ వివరాలు తెలిశాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ల డేటాను షేర్ చేస్తూ.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్స్ ఆధారంగా.. కేవలం 2,200 మంది డాక్టర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్, ఇతర ప్రొఫెషనల్స్ మాత్రమే ఏడాదికి కోటికి పైగా ఆదాయం పొందుతున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ ఆదాయంలో రెంట్స్, వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇతర ఇన్కమ్లను కలపలేదని పేర్కొంది. ఇండియా అభివృద్ధి కోసం ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కానీ చాలా మంది పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఈ భారం నిజాయితీగా పన్నులు చెల్లించే వారి మీద పడుతుందన్నారు. కోటికి పైగా ఆదాయం పొందుతున్న ప్రొఫెషనల్స్ ఇండియాలో కేవలం 2,200 మంది మాత్రమే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మోడీ అన్నారు. ఇండివిడ్యువల్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారంపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ట్విటర్లో డేటాను షేరు చేస్తూ.. పలు ట్వీట్స్ చేసింది.
5.78 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.78 కోట్ల మంది రిటర్న్స్ అందజేశారు. వారిలో 1.03 కోట్ల మంది ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువగా.. 3.29 కోట్ల మంది ఇండివిడ్యువల్స్ ట్యాక్స్బుల్ ఇన్కమ్ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్యలో ఉన్నట్టు తెలిపింది. రూ.5 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వారు 4.32 కోట్ల మంది ఉన్నట్టు చెప్పింది. కోటి మంది ఇన్కమ్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉండగా, 46 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల ఇన్కమ్ రూ.10 లక్షలకు పైన ఉంది. కేవలం 3.16 లక్షల మందికి మాత్రమే రూ.50 లక్షల పైన ఆదాయం ఉంది. ఇక వార్షికంగా కోటిపైన ఆదాయమున్నట్టు 2,200 మంది ప్రొఫెషల్స్ మాత్రమే చెప్పారు.
