భోపాల్ : భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. త్వరలోనే చంపేస్తామంటూ ఫోన్ కాల్ రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను చంపుతామంటూ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ సహచరుడనని పేర్కొంటూ ఓ వ్యక్తి నుంచి శుక్రవారం రాత్రి (జూన్ 17న) ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఒక వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు చంపేస్తానని బెదిరించాడని ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ శనివారం (జూన్ 18న ) టీటీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఫిర్యాదుతో 506, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని టీటీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ చెన్ సింగ్ రఘువంశీ చెప్పారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని చెప్పారు.
ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్పై గెలుపొందారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞాసింగ్ నిందితురాలిగా ఉన్నారు.
