తమిళనాడులో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు ఇవాళ(సోమవారం) శంకుస్థాపన చేశారు. TTD బోర్డు సభ్యుడు, తమిళనాడు ఉల్లందూర్ పేట ఎమ్మెల్యే కుమారగురు ఇటీవల శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 3.98 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం సోమవారం శంకుస్థాపన చేశారు. ఉల్లందూర్ పేటలో జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమాల్లో తమిళనాడు సీఎం పళనిస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుమారగురు సతీసమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ ఘనంగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అదే స్థలంలో వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారి ఉప ఆలయాలు కూడా నిర్మించనున్నారు. ఎమ్మెల్యే కుమారగురు స్థలంతో పాటు కోవెల ఏర్పాటు కోసం రూ.3.16 కోట్లు విరాళంగా అందించారు.
