- సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్లో డెమో
- క్యూఆర్ కోడ్ ఆధారితంగా పేమెంట్స్
సింగపూర్: భీమ్ యూపీఐ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ప్రవేశించింది. భీమ్ యూపీఐ క్యూఆర్ ఆధారిత పేమెంట్స్ను సింగపూర్లో ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2019లో మెర్చంట్ టర్మినల్ వద్ద లైవ్ ట్రాన్సాక్షన్ నిర్వహించడం ద్వారా తన పైలెట్ డెమోను విజయవంతంగా చేపట్టింది. ఈ డెమో కార్యక్రమం శుక్రవారం వరకు జరగనుంది. ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత సిస్టమ్ భీమ్ యాప్తో సింగపూర్లో ఎన్ఈటీఎస్ టర్మినల్స్ వద్ద ఎస్జీక్యూఆర్ను స్కాన్ చేసి పేమెంట్స్ జరుపడానికి అనుమతించనుంది. భీమ్ యాప్ను ఇంటర్నేషనల్గా తీసుకెళ్లడం ఇదే మొదటిసారని లైవ్ డెమోను లాంచ్ చేసిన సింగపూర్కు ఇండియన్ హై కమిషనర్గా ఉన్న జావెద్ అస్రఫ్ చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్(ఎన్ఈటీఎస్) ఫర్ సింగపూర్ కలిసి డెవలప్ చేశాయి. 2020 ఫిబ్రవరి వరకు దీన్ని లైవ్గా తీసుకెళ్లాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు హై కమిషనర్ చెప్పారు. ఇండియా, సింగపూర్ల మధ్య ఫిన్టెక్ కోఆపరేషన్ చేపట్టడంలో ఇది మరో మైలురాయి అని అన్నారు. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపే ఇంటర్నేషనల్ కార్డును, ఎస్బీఐ రెమిటెన్స్ యాప్లను లాంచ్ చేశారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(టీపీసీఐ)కు, మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్(ఎంఏఎస్)కు మధ్య మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా కుదిరింది. సింగపూర్లో జరుగుతున్న ఫిన్టెక్ ఫెస్టివల్ 2019లో ఇండియా నుంచి 43 కంపెనీలు, స్టార్టప్లు పాలుపంచుకుంటున్నాయి.

