దురాశ దు: ఖానికి : రూ.2 కోట్లు వస్తాయని చెప్పి.. రూ. కోటి కొట్టేశారు

దురాశ దు: ఖానికి : రూ.2  కోట్లు వస్తాయని చెప్పి.. రూ. కోటి కొట్టేశారు

ఆశకైనా హద్దు ఉండాలి.. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. తక్కువ సమయంలో  ఎక్కువ సంపాదించొచ్చనే  ఆశతో ఉన్నది పోగొట్టుకుంటున్నారు నేటి యువత.  డిజిటల్ కరెన్సీ  బిట్ కాయిన్లపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందవచ్చని ఆశతో  భారీగా మోసపోతున్నారు ఈ మధ్య.  డబ్బు ఆశ చూపి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెడుతున్నారు.  బిట్ కాయిన్లపై పెట్టుబడితే దండిగా లాభాలు వస్తాయని చెప్పి జేబులు గుళ్ల చేస్తున్నారు. రెండు కోట్లు వస్తాయని  బెంగుళూరులో  కోటి రూపాయలు పోగోట్టుకున్నాడో ఓ ఇంజినీర్. నిండా మునిగాక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

 అసలేం జరిగిందంటే..  బెంగళూరులో శాంతి నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు  రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం  అయింది ఓ మహిళ. ఇంజినీర్ కు  సోనియా షెనాయ్ గా పరిచయం అయిన ఆ మహిళ  బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెట్టేలా చేసింది. తాను ఇంతకు ముందు బిట్ కాయిన్ వ్యాపారంలో  మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేశానని  నమ్మించింది. బిట్ కాయిన్లలో పెట్టుబడి భారీగా లాభాలు వస్తాయని చెప్పింది. 

ఇంజినీర్  జనవరి 2022- 2023 మధ్య బిట్‌కాయిన్‌లలో మొత్తం రూ.95 లక్షలు పెట్టుబడి పెట్టాడు. జులైలో ఇంజనీర్ కు ఫోన్ చేసిన మహిళ.. నీకు 2 కోట్ల  లాభం వస్తుంది కానీ  నువ్వు టీడీఎస్ కి రూ. 50 లక్షలు చెల్లించాలని  చెప్పింది.  దీంతో అతడు  పలు బ్యాంకుల్లో అప్పుచేసి  రూ.50 లక్షలు కట్టాడు.  అయితే 2 కోట్లు రాకపోయే సరికి తాను మోసపోయానని గ్రహించి ఆ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులో బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన ఘటనలు ఇదేం తొలిసారి కాదు.