- 58 మందిని నియమించిన తమిళనాడు ప్రభుత్వం.. ఒక మహిళకు అవకాశం
చెన్నై: ఎప్పటిదో ఆ పోరాటం.. ఇప్పుడు గెలిచింది. బడుగుబలహీన వర్గాల వారిని గుళ్లలో పూజారులుగా నియమించాలన్న దశాబ్దాల నాటి డిమాండ్ ఇప్పుడు తీరింది. బీసీలు, ఎస్సీలను అర్చకులుగా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు బ్రాహ్మణులు కాని 58 మందిని పూజారులుగా నియమించింది. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరు సుహంజన గోపీనాథ్. ఈ నియామకంతో తమిళనాడులో రెండో మహిళా పూజారిగా ఆమె రికార్డులకెక్కారు. ప్రస్తుతం ఆమెను చెన్నైలోని ధేనూపురీశ్వర్ ఆలయంలో పూజారిగా నియమించారు. ఒడియార్ (శైవం) వర్గం కింద ఆమెకు శిక్షణనిచ్చారు. అంతకుముందు పిన్నియక్కళ్ అనే మహిళ తన తండ్రి చనిపోవడంతో వారసత్వంగా అర్చకత్వం చేశారు. దీంతో తమిళనాడులో తొలి మహిళా పూజారిగా నిలిచారు. అయితే, పూజారిగా ఆమెను ఎవరూ అంగీకరించకపోవడంతో కోర్టుకెళ్లి విజయం సాధించారు.
ఐదుగురు ఎస్సీలు..
ఆ 58 మందిలో 24 మంది ప్రభుత్వ అర్చక శిక్షణ పాఠశాలల్లో చదువుకోగా.. 34 మంది ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొంది.. అపాయింట్మెంట్ అందుకున్నోళ్లలో ఐదుగురు ఎస్సీలున్నారు. ఆరుగురు అత్యంత వెనుకబడిన కులస్థులు కాగా.. 12 మంది బీసీలున్నారు. ఒకరు జనరల్ కేటగిరీకి చెందిన వారు. వారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుళ్లలో పనిచేసేందుకుగానూ 138 మందిని నియమించారు.
ఇదీ చరిత్ర...
1934 ఆగస్టు 8: ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా అన్ని కులాలకు చెందిన వారిని పూజారులుగా నియమించాలంటూ ఈవీ రామస్వామి పెరియార్ డిమాండ్ చేశారు.
1969: ద్రవిడర్ కళగం నేత అయిన పెరియార్.. తొలిసారి నిరసనలకు పిలుపునిచ్చారు.
1970: నాటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి తమిళనాడు హిందూ రెలిజియస్ ఎండోమెంట్ చట్టాల్లో సవరణలు చేశారు. అర్చకత్వంలో వారసత్వ నియామకాలన్నింటినీ రద్దు చేశారు. అన్ని కులాలకు చెందిన వారిని పూజారులుగా నియమిస్తూ ఓ కొత్త చట్టాన్ని తెచ్చారు.
1972:కొత్త చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపేసింది.
1982: ఆ కొత్త చట్టం, ఆలయాల్లో సంస్కరణల కోసం నాటి సీఎం ఎంజీ రామచంద్రన్.. మహారాజన్ కమిటీని ఏర్పాటు చేశారు.
2006: అన్ని కులాల వారికీ అర్చక శిక్షణను ఇచ్చేందుకు శిక్షణ కేంద్రాలు, స్కూళ్ల ఏర్పాటు కోసం జీవోను పాస్ చేశారు. అదే ఏడాది సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది.
2016 డిసెంబర్: పుట్టుక లేదా కులం ఆధారంగా గుళ్లలో పూజారుల నియామకాన్ని చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
2017: సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం.. వేరే కులాలకు చెందిన 62 మందిని పూజారులుగా నియమించింది.
