ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) పేరును త్వరలోనే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఎంఏఐ)గా మారబోతున్నట్టు సాఫా ప్రెసిడెంట్ డాక్టర్ పీవీఎస్ జగన్ మోహన్ రావు ప్రకటించారు. ఎనిమిది సార్క్ దేశాల మొట్టమొదటి సాఫా ఫౌండేషన్ డే కాన్ఫరెన్స్ గురువారం హైదరాబాద్లోని మారియట్ హోటల్లో జరిగింది. సాఫా అనేది సౌత్ ఏసియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్. ఇది సార్క్ దేశాల అపెక్స్ బాడీ. ఈ కాన్ఫరెన్స్లో దక్షిణాసియాలోని ప్రొఫెషనల్ అకౌంటెంట్లకు ఉన్న అవకాశాలపై, సవాళ్లపై చర్చించారు.
దక్షిణాసియా దేశాల్లోని అకౌంటింగ్ ప్రొఫిషన్ను ప్రోత్సహించేందుకు సాఫాను ఏర్పాటు చేసినట్టు జగన్ మోహన్ రావు చెప్పారు. తెలంగాణ నుంచి తొలి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ప్రొఫెషనల్ ఈయనే కావడం విశేషం. ఈ రీజన్లోని అకౌంటింగ్ బాడీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి సాఫా తీసుకొస్తుందన్నారు. సార్క్ రీజన్లో సీఎంఏ, సీఏ క్వాలిఫై అయిన వారు.. ఇతర ప్రాంతాల్లో కూడా అవకాశాలు పొందేందుకు ఇది సహకరిస్తుంది. నేపాల్, అఫ్గనిస్తాన్, భూటాన్, మాల్దీవుస్ దేశాలు ప్రొఫెషనల్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ బాడీలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా సాఫా సాయం చేస్తుందని చెప్పారు.
అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి….
ఇటీవల పెరిగిన టెక్నాలజీతో పారదర్శకత వచ్చి.. కంపెనీల బండారాలు బయట పడుతున్నాయని చెప్పారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ను ఆడిటర్లు ఫాలో అయినప్పుడు ఇలాంటి మోసాలు జరగవని అన్నారు. కొందరు ఆడిటర్లు రూల్స్ ఫాలో అవకపోవడం, ప్రశ్నించకపోవడంతో కంపెనీల్లో ఈ అవకతవకలు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ కాన్ఫరెన్స్లో నేపాల్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ ఆచార్య కూడా హాజరయ్యారు. మొత్తం ఈ కాన్ఫరెన్స్కు 150 నుంచి 200 మంది వచ్చారు. సాఫాలో 3.5 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. సాఫా బాడీలో మొత్తం 10 ప్రొఫిషినల్ బాడీస్, ఎనిమిది దేశాలు, ఛార్టెడ్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉంటాయి.
